హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం 2 వారాల్లోగా డీజీపీ నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చింది. సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్ల జాబితాను యూపీఎస్సీకి పంపితే అకడి నుంచి గత నెల 12న సిఫార్సులు అందాయని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్రెడ్డి చెప్పారు. డీజీపీగా బీ శివధర్రెడ్డి నియామకం చట్టవ్యతిరేకంగా జరిగిందని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలు చేయలేదని పేర్కొంటూ హైదరాబాద్కు చెందిన టీ ధన్గోపాల్రావు దాఖలు చేసిన పిటిషన్పై ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
ప్రకాశ్సింగ్ బాదల్ కేసులో సుప్రీంకోర్టు జారీచేసిన మార్గదర్శకాల మేరకు డీజీపీగా శివధర్రెడ్డి నియామకం జరగలేదని, శాశ్వత ప్రాతిపదికపై జరగాల్సిన ఈ నియామకాన్ని తాతాలిక విధానంలో చేపట్టడం చెల్లదని తెలిపారు. దీనిపై అడ్వకేట్ జనరల్ స్పందిస్తూ.. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం ఆలస్యమైందని, 2 వారాల గడువు ఇస్తే యూపీఎస్సీ సిఫారసుల మేరకు ప్రభుత్వం డీజీపీని నియమిస్తుందని చెప్పారు. దీంతో తదుపరి విచారణను ఈ నెల 13కి వాయిదా వేస్తున్నట్టు జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డి ప్రకటించారు.