హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): కరీంనగర్ జిల్లా రామగుండం నియోజకవర్గంలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఆ నియోజకవర్గానికి చెందిన బీజేపీ సీనియర్ నేత కౌశిక్ హరి త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు శుక్రవారం ప్రగతిభవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, మరో మంత్రి హరీశ్రావుతో కౌశిక్ భేటీ అయ్యారు.
పార్టీలో తనతోపాటు తన వర్గం నేతలు చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. చేరికల విషయంపై ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ప్రభుత్వ విప్ బాల సుమన్తో మంత్రులు చర్చలు జరిపారు. ఈ మేరకు త్వరలోనే రామగుండంలో భారీ బహిరంగసభను ఏర్పాటు చేసి కౌశిక్ హరితో సహా పలువురు బీజేపీ నేతలు బీఆర్ఎస్లో చేరనున్నారు. సంఘటిత, అసంఘటిత కార్మిక సంఘాల నేతగా రామగుండం ప్రాంతంలో ప్రజాదరణ పొందిన కౌశిక్ హరికి ప్రజల్లో మంచి పట్టు ఉన్నది. 2009లో పీఆర్పీ నుంచి పోటీ చేయగా కేవలం 1,200 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో కూడా పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చారు.