హైదరాబాద్, మార్చి11 (నమస్తే తెలంగాణ): సౌదీ అరేబియాలో ఆదివారం సాయంత్రం నెలవంక కనిపించిందన్న ప్రకటనతో మన దేశంలో మంగళవారం నుంచి పవిత్ర రంజాన్మాసం ప్రారంభం కానున్నది. సౌదీ ప్రెస్ ఏజెన్సీ ప్రకటనతో ఆ దేశంలో సోమవారం నుంచే రంజాన్ నెల మొదలైంది. అక్కడి ముస్లింలు ఉపవాస దీక్షలను మొదలుపెట్టారు. యూఏఈ, ఖతార్లో కూడా సోమవారమే మొదటి రోజాని ప్రకటించాయి. మనదేశంలో మాత్రం మంగళవారం నుంచి ఉపవాస దీక్షలను పాటించనున్నారు. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు దాదాపు ఒక మాసంపాటు ఈ దీక్షలను పాటిస్తారు. తిరిగి నెలవంక దర్శనంతో రంజాన్ మాసం ముగించి ఈద్-ఉల్-ఫితర్ను నిర్వహించుకోవడం ఆనవాయితీ. ఈ మాసంలో ప్రత్యేక ప్రార్థనల కోసం ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ప్రముఖ మసీదుల వద్ద అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.