హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): రాఖీ పౌర్ణమి సందర్భంగా శుక్రవారం ఒక్కరోజే ఆర్టీసీకి రూ.20 కోట్ల ఆదాయం వచ్చిందని ఆ సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. హైదరాబాద్లోని బస్ భవన్లో శనివారం బాజిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీ నడుచుకొంటున్నదని తెలిపారు. అందరికీ అందుబాటులో టికెట్ ధరలు ఉన్నాయని చెప్పారు. ఆర్టీసీ కార్గో సేవలు ప్రజలను ఆకట్టుకున్నాయని వివరించారు. ఆగస్టు 15న పుట్టబోయే బిడ్డకు 12 సంవత్సరాలు వచ్చేవరకూ ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించామని స్పష్టంచేశారు. ఆర్టీసీ అభివృద్ధిలో భాగస్వాములైన సిబ్బందికి అండగా ఉంటామన్నారు. సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో ఆర్టీసీకి పూర్వవైభవం తీసుకొస్తామని పేర్కొన్నారు.