హైదరాబాద్, మార్చి 25(నమస్తే తెలంగాణ) : ఇప్ప పువ్వు సారా అంశంపై బుధవారం శాసనసభలో కాంగ్రెస్, బీజేపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నది. బీజేపీ సభ్యుడు రాకేశ్రెడ్డి తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాల్సిందేనని కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టగా, తమ సభ్యుడు ఎటువంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయనందున క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదని బీజేపీ సభ్యులు భీష్మించారు. దీంతో దాదాపు గంటకుపైగా సభా సమయం వృథా అయింది. బుధవారం అసెంబ్లీలో పద్దులపై చర్చ సందర్భంగా రాకేశ్రెడ్డి ఇప్పపువ్వు సారా(టెకీలా) అంశాన్ని ప్రస్తావించారు. గతంలో ఇప్ప పువ్వు సారా తాగినవారు ఆరడుగుల ఎత్తు పెరిగి వందేండ్లు బతికేవారని, అది ఆర్గానిక్ విస్కీ వంటిదని పేర్కొన్నారు.
కల్తీ కల్లును అరికట్టేందుకు ఇప్పపువ్వు సారాను అందుబాటులోకి తేవాలని సూచించారు. ప్రభుత్వం తెచ్చే ఇప్ప సారా బ్రాండ్కు ఇందిరమ్మ పేరు మాత్రం పెట్టొద్దని సూచించారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు ఒక్కసారిగా లేచి నిల్చొని తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. మంత్రులు శ్రీధర్బాబు, శ్రీహరి, జూపల్లి, సీతక్క తదితరులు జోక్యం చేసుకొంటూ మాజీ ప్రధానిపై ఈ విధంగా మాట్లాడటం సరికాదని, సభా సంప్రదాయాలకు విరుద్ధమని పేర్కొన్నారు. వెంటనే రాకేశ్రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాకేశ్రెడ్డి వెంటనే తమ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ప్యానల్ స్పీకర్ బాలూనాయక్ సూచించారు.
దీనిపై బీజేపీ పక్ష నాయకులు మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ, తమ పార్టీ సభ్యుడు ఎటువంటి అభ్యంతరకర మాట మాట్లాడలేదని, కావాలంటే రికార్డులు పరిశీలించి చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ప్రాణత్యాగానికి సిద్ధపడిన కేసీఆర్పై అధికారపక్షం సభ్యులు అనేకసార్లు అభ్యంతరకరంగా మాట్లాడారని, మరి దాని సంగతేమిటని ఇదే సమయంలో బీఆర్ఎస్ సభ్యుడు హరీశ్రావు ప్రశ్నించారు. రాకేశ్రెడ్డి మాట్లాడుతూ..ఇందిరాగాంధీ అంటే గౌరవం ఉన్నదని, సారా బ్రాండ్కు ఆమె పేరు పెట్టవద్దని మాత్రమే తాను సూచించినట్టు తెలిపారు. అనంతరం మంత్రి శ్రీధర్బాబు విజ్ఞప్తి మేరకు రాకేశ్రెడ్డి వ్యాఖ్యలను రికార్డు ల నుంచి తొలగిస్తున్నట్టు ప్యానల్ స్పీకర్ రూలింగ్ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.
హైదరాబాద్, మార్చి 25(నమస్తే తెలంగాణ): ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తున్న నిధులు ఖర్చుచేయనందుకు, సబ్ప్లాన్ను అమలు చేయనందుకు ప్రభుత్వంపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. డీసీసీబీ బ్యాంకుల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం శాసనసభలో పద్దులపై చర్చ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలు అప్పు చెల్లించకపోతే మారిటోరియం ఇచ్చే బ్యాంకులు, రైతుల విషయంలో మాత్రం ఇండ్లు జప్తు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రైతులు పంట పొలాలకు వెళ్లే మార్గాల్లో రోడ్ల నిర్మాణానికి రూ. 2వేల కోట్లు కేటాయించాలని కోరారు. ఆగస్టులో వచ్చిన వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10వేల చొప్పున పరిహారం ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, ఇంతవరకు పది పైసలు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.