హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): తాను వ్యాపారపరంగా ఎదగడానికి, తద్వారా రాజకీయంగా రాణించడానికి దోహదపడిన గ్రానైట్ కుటుంబాన్ని ఎన్నడూ విస్మరించబోనని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. ఏ పదవి లేకుండానే గ్రానైట్ పరిశ్రమకు ఎంతో చేశానని, ఇప్పుడు ఎంపీగా ఎన్నికైన తర్వాత ఈ పరిశ్రమను కాపాడుకోవడంలో ముందుంటానని అన్నారు. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన రవిచంద్రను తెలంగాణ గ్రానైట్ పరిశ్రమ యజమానుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్లో సన్మానించారు.
ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ.. తనకు రాజ్యసభ సభ్యుడిగా సీఎం కేసీఆర్ అవకాశం కల్పించడానికి గ్రానైట్ పరిశ్రమ ఎంతో దోహదం చేసిందని, అలాంటి పరిశ్రమ తనకు కన్నతల్లి వంటిదని అన్నారు. ఈ పరిశ్రమలో ఉన్నవాళ్లంతా తన కుటుంబ సభ్యులేనని.. వాళ్లకు ఏ కష్టం వచ్చినా కుటుంబ పెద్దగా ముందుంటానని హామీ ఇచ్చారు. పెద్ద మనసు చేసుకొని, పెద్దల సభకు పంపిన సీఎం కేసీఆర్కు గ్రానైట్ పరిశ్రమ ఎప్పుడూ రుణపడి ఉండాలని అన్నారు. టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. గ్రానైట్ కుటుం బం నుంచి ఇంతకాలం తానొక్కడే ఎంపీగా ఉన్నానని.. ఇప్పుడు రవిచంద్ర కూడా ఎంపీగా ఎన్నికవడం సంతోషకరమన్నారు. పరిశ్రమకు ఇక మీదట తామిద్దరం అండగా ఉంటామన్నారు.
ఖమ్మం జిల్లాకు ఒకేసారి రెండు రాజ్యసభ పదవులు ఇచ్చిన కేసీఆర్ను గ్రానైట్ పరిశ్రమ మరవొద్దని అన్నారు. కార్యక్రమంలో గ్రానైట్ పరిశ్రమల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాయల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి చీపిరిశెట్టి శంకర్, ప్రతినిధులు పాటిబండ్ల యుగంధర్, ఉప్పల వెంకటరమణ, గంగుల ప్రదీప్, జిల్లా అశోక్, చక్రధర్రెడ్డి, శరాబందీ, తుళ్లూరి కోటేశ్వరరావు, పుసులూరి నరేందర్, తమ్మినేని వెంకట్రావు, ఫణికుమార్, శ్రీధర్, రవీందర్రావు, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి గ్రానైట్ యజమానులు పాల్గొన్నారు.