ఖమ్మం, జనవరి 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ సభ దేశ రాజకీయాలకు దిశ, దశ నిర్దేశించే విధంగా జరుగుతుందని రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి పేర్కొన్నారు. సత్తుపల్లిలో శుక్రవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయని, అలాంటి నేత ఇప్పుడు దేశానికి ఎంతో అవసరమని చెప్పారు.
సీఎం కేసీఆర్ విజన్తో రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలు అందుతున్నాయని వివరించారు. తాను సేవా కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సత్తుపల్లిలో రూ.750 కోట్లతో దేశంలోనే అతిపెద్ద 1,500 పడకల క్యాన్సర్ దవాఖాన నిర్మించనున్నట్టు వెల్లడించారు. దవాఖాన నిర్మాణానికి త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయిస్తామని చెప్పారు. వచ్చే 30 ఏండ్లలో సత్తుపల్లి మహానగరంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడిగా సత్తుపల్లికి గౌరవం తెచ్చేలా వ్యవహరిస్తానని అన్నారు.