కాచిగూడ,ఫిబ్రవరి 17: ప్రధాని మోదీ బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నాడని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య విమర్శించారు. కొన్నేండ్లుగా బీసీలకు కేంద్ర బడ్జెట్లో అన్యాయం జరుగుతూనే ఉన్నదని పేర్కొన్నారు. హైదరాబాద్ కాచిగూడలో శుక్రవారం వివిధ రాష్ర్టాల బీసీ నేతలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి అసెంబ్లీ, చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీలంటే బిచ్చగాళ్లు కాదని, వాటాదారులని, 2 లక్షల కోట్ల బడ్జెట్తో బీసీ సబ్ప్లాన్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 25న నిర్వహించే చలో విజయవాడ పోస్టర్ను ఆర్ కృష్ణయ్య ఆవిష్కరించారు. కృష్ణయాదవ్, నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, మల్లేశ్, వేముల రామకృష్ణ, రాజేందర్, శ్రీశైలం, రాములు తదితరులు పాల్గొన్నారు.