వరంగల్, హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దేవాదుల ప్రాజెక్టు ద్వారా ఏడాది పొడవునా సాగునీరు అందించే సమ్మక్క (తుపాకులగూడెం) బరాజ్ నిర్మాణం సంపూర్ణమైంది. దాదాపు 14 లక్షల ఎకరాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించడం లక్ష్యంగా మొదలుపెట్టిన సమ్మక్క బరాజ్ నుంచి వచ్చే వానకాలం నుంచి పూర్తిస్థాయిలో సాగునీటిని అందించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 1,143 మీటర్ల పొడవున నిర్మించిన ఈ బరాజ్లో 59 రేడియల్ గేట్ల బిగింపు పూర్తయింది. మొత్తం 22.50 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని, 11.52 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పని పూర్తిచేశారు. ఇందుకోసం ఇప్పటివరకు రూ.1,829 కోట్లను ఖర్చుచేశారు. రహదారి వంతెన నిర్మాణం కూడా జరిగిపోయింది. ఈ నెల 23 లోపు ప్రాజెక్టు పూర్తిస్థాయిలో సిద్ధమవుతుందని సాగునీటిశాఖ ఉన్నతాధికారులు తెలిపారు.
మూడు జిల్లాలకు ప్రయోజనం
తుపాకులగూడెంకు పైన గంగారం వద్ద ఏర్పాటు చేసిన పంపులతో ఎత్తిపోతల ద్వారా దేవాదుల ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. పాత వరంగల్, సిద్దిపేట, సూర్యాపేట జిల్లాల్లోని 6.21 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ అవుతుంది. రెండు పంటలకు పూర్తి స్థాయిలో సాగునీరు అందుతుంది. వరంగల్ మహానగరంతోపాటు ఎన్నో గ్రామాలకు తాగునీరు అందుతుంది. మామూలుగా దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు వద్ద గోదావరి నీటి మట్టం 71 మీటర్లు ఉన్నప్పుడే మోటర్లు నీళ్లను ఎత్తిపోయగలవు. అదికూడా వానలు బాగా పడే రోజుల్లో మాత్రమే ఈ ఎత్తిపోత సాధ్యపడుతుంది. ఏడాదిలో మూడు నెలలకు మించి ఈ పరిస్థితి ఉండదు. ఇలాంటి పరిస్థితిని పూర్తిగా మార్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ములుగుజిల్లా కన్నాయిగూడెం తుపాకులగూడెం వద్ద సమ్మక్క బరాజ్ను నిర్మించారు. దేవాదుల పంప్హౌజ్ ఉన్న ప్రదేశం నుంచి 5 కిలోమీటర్ల దిగువన ఈ బరాజ్ను కట్టారు. 83 మీటర్ల మేర నీటిని నిల్వచేసేలా 92 మీటర్ల ఎత్తున బరాజ్ను నిర్మించారు. దీంతో ఏడాది పొడవునా నీటిని ఎత్తిపోయడానికి అవకాశం ఏర్పడుతుంది.
దేవాదులపై రజత్కుమార్ సమీక్ష
దేవాదుల ఎత్తిపోతల పథకం పనులపై సంబంధిత ఉన్నతాధికారులతో సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ గురువారం ప్రత్యేకంగా జలసౌధలో సమీక్షించారు. ఇప్పటికే పనులు తుదిదశకు చేరుకోగా, మిగిలిన పనులన్నీ సత్వరమే పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఈఎ న్సీ మురళీధర్, ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి, సీఈ విజయ్భాస్కర్, ఈఈలు పాల్గొన్నారు.