హైదరాబాద్ : అంతర్జాతీయ వేదికపై ‘రాజన్న సిరిపట్టు’ ఆవిష్కృతమైంది. సిరిసిల్ల నేతన్న తయారు చేసిన పట్టుచీరలు న్యూజిలాండ్ మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్ చేతుల మీదుగా శనివారం ఆ దేశంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజన్న సిరిపట్టు బ్రాండ్ను ప్రారంభించిన న్యూజిలాండ్ మంత్రి ప్రియాంకకు తెలంగాణ టెక్స్టైల్ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమం సందర్భంగా మంత్రి కేటీఆర్ వీడియో సందేశం పంపారు.
సిరిసిల్లకు చెందిన నేతన్నల ఉత్పత్తులు ప్రపంచ వేదికలపై ఆవిష్కృతం కావడం సంతోషాన్ని ఇస్తుందని మంత్రి పేర్కొన్నారు. ప్రియాంక రాధకృష్ణత్ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎన్ఆర్ఐ, బ్రాండ్ తెలంగాణ ఫౌండర్ సునీత విజయ్ని కేటీఆర్ అభినందించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలతో ఒకప్పుడు సంక్షోభంలో ఉన్న సిరిసిల్ల నేతన్నలు నేడు వినూత్నమైన ఉత్పత్తులతో ప్రపంచాన్ని ఆకర్షించే పరిస్థితికి చేరుకున్నారన్నారు.
సిరిసిల్లకు చెందిన హరిప్రసాద్లాంటి నైపుణ్యం కలిగిన నేతన్నలు, వినూత్న ఉత్పత్తులను తయారు చేయడంపై కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. సిరిసిల్ల కేంద్రంగా బతుకమ్మ చీరలతో పా అగ్గిపెట్టెలు ఇమిడి చీర, వివిధ కళాకృతులు, వివిధ పేర్లతో రూపొందించిన వినూత్నమైన చీరెలను నేయడం జరుగుతున్నదన్నారు. రాజన్న సిరిపట్టుకు మంచి భవిష్యత్తు ఉండాలని, అందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను ప్రభుత్వం నుంచి అందిస్తామని హామీ ఇచ్చారు.
నాలుగు సంవత్సరాల క్రితం బతుకమ్మ చీరల తయారీని చూసేందుకు తెలంగాణకు వచ్చిన బ్రాండ్ తెలంగాణ ఫౌండర్ సునీత విజయ్ సిరిసిల్లలోని నేతన్నలు, వారి నైపుణ్యం గురించి తెలుసుకున్నారు. ఆ సమయంలో సిరిసిల్లకు చెందిన నేతన్న హరిప్రసాద్ గురించి తెలుసుకొని.. అతనితో పట్టుచీరెలు తయారు చేయించి.. అమెరికా, యూకే, న్యూజిలాండ్ తదితర దేశాల్లో తనకు తెలిసిన వారికి సిరిసిల్ల పట్టుచీరెలకు ఆర్డర్లు ఇప్పించారు. సిరిసిల్ల పట్టుచీరలకు ఓ బ్రాండ్ తీసుకురావాలన్న ఉద్దేశంతో ‘రాజన్న సిరిపట్టు’గా నామకరణం చేశారు.
న్యూజిలాండ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ దేశ మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్, 300 మంది ప్రవాస భారతీయుల సమక్షంలో సిరిసిల్ల నేతన్నల ఉత్పత్తులను ప్రదర్శించారు. ఆ తర్వాత సిరిసిల్ల పట్టుచీరలతో ఫ్యాషన్ షోను సైతం నిర్వహించారు. రాజన్న సిరిపట్టు బ్రాండ్కు ప్రత్యేక తీసుకురావాలన్న తన ఆలోచనకు తెలంగాణ ప్రభుత్వంతో పాటు ప్రవాసీ మహిళల నుంచి స్పందన వస్తుందని బ్రాండ్ తెలంగాణ ఫౌండర్ సునీత విజయ్ పేర్కొన్నారు. ఒక్కరితో ప్రారంభమైన పట్టుచీరెల ఉత్పత్తి, ప్రస్తుతం జిల్లాలో 40 మందికిపైగా నేత్నలకు ఉపాధి లభిస్తుందని ఆమె తెలిపారు.
నేతన్నల ఉత్పత్తులను ముఖ్యంగా ‘రాజన్న సిరిపట్టు’ పట్టు చీరెలను తన చేతుల మీదుగా ప్రారంభించడం తనకు సంతోషాన్ని ఇచ్చిందని న్యూజిలాండ్ మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్ అన్నారు. వ్యక్తిగతంగా తనకు పట్టు చీరెలు ఎంతో ఇష్టమని, తెలంగాణకు చెందిన బతుకమ్మ సంబరాల కోసం ప్రవాసీలు తనని ఆహ్వానించిన ప్రతిసారి, వాటినే ధరిస్తానన్నారు. పట్టుచీరలతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గతంలో సిరిసిల్లకు చెందిన ఒక పట్టుచీరెను ధరించి బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొన్న విషయం ట్విట్టర్ ద్వారా తెలుసుకున్న కేటీఆర్.. ఆయనను తర్వాత హైదరాబాద్లో ఒక సమావేశంలో కలిసినట్లు ప్రస్తావించారు.