హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్లో రాజన్న సిరిసిల్ల మొదటి స్థానంలో నిలిచింది. జిల్లాలోని అన్ని గ్రామాలను ఓడీఎఫ్ మాడల్ క్యాటగిరీగా ప్రకటించినందుకుగాను నవంబర్లో ఫోర్స్టార్ రేటింగ్లో జిల్లాకు మొదటి స్థానం లభించింది. ఈ విషయాన్ని కేంద్ర జల్జీవన్ మిషన్ మంత్రిత్వశాఖ శనివారం వెల్లడించింది. స్వచ్ఛ సర్వేక్షణ్లో 75 నుంచి 100 % స్కోరు వచ్చిన జిల్లాల కు ఫోర్స్టార్ రేటింగ్ ఇస్తారు. సిరిసిల్ల జిల్లా బేస్లైన్ ఓడీఎఫ్ ప్లస్లో 99.37%, ప్రస్తుత ఓడీఎఫ్ ప్లస్లో 99.53 %, డెల్టా అచీవ్మెంట్లో 76.19% స్కోరు సాధించి తొలి ర్యాంకు దక్కించుకున్నది.
ఓడీఎఫ్ ప్లస్ మాడల్ ఇలా
ఓడీఎఫ్ ప్లస్ మాడల్లో అత్యధిక గ్రామాలు ఉన్న జిల్లాలను ఎంపిక చేస్తున్నారు. గ్రామాల్లో ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి, అన్ని ప్రభుత్వ సంస్థల్లో మరుగుదొడ్ల వినియోగం, తడి, పొడి చెత్త సక్రమ నిర్వహణ, కంపోస్ట్ షెడ్ల వినియోగం ఆధారంగా ఓడీఎఫ్ ప్లస్ మాడల్కు ఎంపిక చేస్తారు.
మంత్రి కేటీఆర్ హర్షం
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ -2023 అవార్డుల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు దేశంలోనే మొదటి స్థానం రావడంపై ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ‘మీ నిరంతర మార్గదర్శనం, సహకారం వల్లనే ఇది సాధ్యమైంది’ అంటూ సిరిసిల్ల జిల్లా కలెక్టర్ను, ప్రజాప్రతినిధులను, అధికారులను, ఉద్యోగులను ట్విట్టర్ వేదికగా అభినందించారు. దృఢ సంకల్పంతో అద్భుతాన్ని ఆవిషరించారని ప్రశంసించారు. గతాన్ని మార్చుకొని ఘనమైన వర్తమానాన్ని సొంతం చేసుకుంటున్న సిరిసిల్ల గడ్డ విజయపరంపరలో తాజా అవార్డులు కూడా చేరాయని పేర్కొన్నారు.
ఈ గెలుపునకు కారణమైన సిరిసిల్ల జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్, జిల్లా అధికారులు, సర్పంచ్, వార్డుమెంబర్లు , క్షేత్రస్థాయిలో పనిచేసే పంచాయతీ సెక్రటరీతోపాటు ప్రతి ఒకరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో సిరిసిల్ల రాత మార్చే యజ్ఞంలో పనిచేస్తున్నవారందరికీ ఈ అవార్డు అంకితమన్నారు. ఇదే స్ఫూర్తితో రాజన్న సిరిసిల్ల జిల్లాను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు మరింత కృషి చేయాలని సూచించారు. స్వచ్ఛసర్వేక్షణ్4-స్టార్ ర్యాం కింగ్ కేటగిరీలో రాజన్న సిరిసిల్ల జిల్లా దేశంలోనే మొదటి స్థానం దక్కించుకోవడంతో జిల్లా వాసు లు సంబురాలు జరుపుకొన్నారు. జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య శనివారం జిల్లా కేంద్రంలో కేక్ కట్ చేశారు.అనంతరం కలెక్టరేట్లో జడ్పీ చైర్పర్సన్ కేక్ కట్చేసి కలెక్టర్ అనురాగ్ జయంతికి తినిపించారు.