రాజన్న సిరిసిల్ల, మే 25(నమస్తే తెలంగాణ)/సిరిసిల్ల కలెక్టరేట్/నల్లగొండ/ అర్వపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ రింగు అంజయ్య(57) కరోనాతో కన్నుమూశారు. వారం రోజులుగా హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్సపొందుతూ మంగళవారం మరణించారు. శ్వాస సమస్య ఎక్కువ కావడం వల్లే చనిపోయారని వైద్యులు వెల్లడించారు. అంజయ్య స్వస్థలం సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం జాజిరెడ్డిగూడెం. ఆయన నల్లగొండలోని చంద్రగిరి విల్లాస్లో స్థిరనివాసం ఏర్పాటుచేసుకున్నారు. నిరుపేద దళిత కుటుంబంలో జన్మించిన ఈయన 1995లో గ్రూప్-2కు ఎంపికై ఉప తాసిల్దార్గా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. తాసిల్దార్గా, ఆర్డీవోగా, డీఆర్వోగా సుదీర్ఘకాలం పనిచేశారు. 2020 ఫిబ్రవరి 12న రాజన్న సిరిసిల్ల జిల్లాకు అదనపు కలెక్టర్గా పదోన్నతిపై వచ్చారు. ఈయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
అంజయ్య మృతి తీరనిలోటు: మంత్రి కేటీఆర్
అదనపు కలెక్టర్ ఆర్ అంజయ్య మృతి పట్ల ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. కొద్దికాలంలోనే జిల్లా ప్రజలకు విస్తృత సేవలందించారని, సౌమ్యుడిగా అందరి మనసులో స్థానం సంపాదించారని కొనియాడారు. బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించిన అంజయ్య మరణం తీరనిలోటన్నారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంజయ్య మృతి పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు, నాఫ్స్ కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు చంద్రమోహన్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి, కోశాధికారి భాస్కర్రావు తదితరులు సంతాపం తెలిపారు.