వేములవాడ టౌన్, డిసెంబర్ 3: భక్తుల పుణ్యస్నానాలకు వేములవాడ రాజన్న ఆలయ ధర్మగుండం సిద్ధమైంది. కరోనా కారణంగా 34 నెలల కిందట పుష్కరిణిలో పుణ్యస్నానాలను నిలిపివేశారు. ఆదివారం నుంచి తిరిగి ధర్మగుండంలో పుణ్యస్నానాలకు అనుమతిస్తున్నారు. ఆలయ, వేములవాడ మున్సిపల్ అధికారులు పూడికతీత పనులు చేపట్టారు. పుష్కరిణి చుట్టూ గల గోపురాలను, మెట్లను శుభ్రం చేశారు. మండపాలకు రంగులు వేసి అందంగా తీర్చిదిద్దారు. శుక్రవారం మంచినీటితో పుష్కరిణిని నింపారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ధర్మగుండంలో గణపతిపూజ, కరోనా నివారణ సంప్రోక్షణ పూజల అనంతరం పుణ్యస్నానాలను ప్రారంభించనున్నారు.