వేములవాడ : వేములవాడకు(Vemulavada )సీఎం రేవంత్ రెడ్డి(Revanth reddy) వస్తున్న సందర్భంగా మధ్యాహ్నం ఒంటిగంట వరకు భక్తులకు రాజన్న దర్శనాలను అధికారులు నిలిపివేశారు. ప్రధాన ద్వారం మూసివేసి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో ప్రధాన ద్వారం వద్ద మొక్కులు చెల్లించుకొని భక్తులు వెనుదిరుగుతున్నారు. కాగా, సీఎం పర్యటన నేపథ్యంలో రాజన్న ఆలయ పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు సీఎం రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ముందస్తుగా బీఆర్ఎస్, బీజేపీ నేతలు, మాజీ సర్పంచులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.
ఉదయాన్నే ఇళ్లల్లోకి వెళ్లి అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఆరు గ్యారెంటీలపై బీఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నిస్తాయని, పెండింగ్ బిల్లులపై మాజీ సర్పంచ్లు నిలదీస్తారని, లగచర్ల ఘటనపై గిరిజన సంఘం నాయకులు అడ్డుకుంటారని, రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లపై విద్యార్థి సంఘం నాయకులు గొంతెత్తుతారని, దళితబంధు, ఎస్సీ వర్గీకరణపై ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీ నాయకులు రచ్చ చేస్తారనే అనుమానంతో ముందస్తుగా అరెస్టు చేశారు.