హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికలముందు బీఆర్ఎస్లో అసంతృప్తి పెరుగుతుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్న విపక్షాలకు ఆశాభంగమే ఎదురవుతున్నది. బలమైన నాయకత్వానికి తోడు సుశిక్షితులైన క్యాడర్ ఉండటంతో పార్టీలో ఎలాంటి సమస్య వచ్చినా చిటికెటో పరిష్కారమవుతున్నది. బీఆర్ఎస్ ప్రజాబలానికి, నాయకత్వ పటిమకు స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో చోటుచేసుకున్న తాజా పరిణామమే నిదర్శనం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ ఒకేసారి 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించటంతో టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు తిరుగుబాటు చేస్తారని, వారికి గాలం వేసి తమవైపు తిప్పుకోవచ్చని విపక్షాలు ఆశించాయి. కానీ, అలా జరుగలేదు. బీఆర్ఎస్ ప్రజాబలాన్ని అంచనావేసిన ఆశావహులు పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉన్నారు. ఈ ‘కట్టుబాటు’ వాతావరణానికి బీటలు వేయాలని విపక్షాలు యథాశక్తి ప్రయత్నించాయి. ఆశావహులను ఎగదోసి కుంపటి రాజేసేందుకు విశ్వప్రయత్నాలు చేశాయి.
ఫలిస్తున్న బీఆర్ఎస్ సమన్వయ వ్యూహం
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఈసారి 8 నియోజకవర్గాల్లో ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలకు బదులుగా కొత్తవారికి టికెట్లు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ క్రమంలో టికెట్ ఆశించిన ఆశావహులు నిరాశకు లోనయ్యారని గ్రహించిన పార్టీ అధినేత, తక్షణమే వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని భవిష్యత్తు అవకాశాలపై హామీ ఇచ్చారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్రావుతోపాటు మరికొంతమంది నేతలను రంగంలోకి దింపి టికెట్లు రానివారి అనుచరులతో సంప్రదింపులు జరిపారు. దీంతో అందరూ ఎక్కడికక్కడ సర్దుకొని క్రమశిక్షణగల నాయకులుగా కార్యక్షేత్రంలోకి దిగారు. రెండుమూడు చోట్ల మినహా అన్ని నియోజకవర్గాల్లో సర్దుబాట్లు పూర్తి అయ్యాయని పార్టీ వర్గాలు తెలిపాయి.
మంత్రి కేటీఆర్తో కడియం, రాజయ్య భేటీ
ఐటీశాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం స్టేషన్ఘన్పూర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ప్రస్తుత ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డితో సమావేశమయ్యారు. నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితిపై చర్చించారు. నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులను బేరీజు వేసిన తర్వాతే సీఎం కేసీఆర్ అభ్యర్థిని నిర్ణయించారని, పార్టీ ఆదేశానుసారం పనిచేయాలని సూచించారు. అదే సమయంలో ఎమ్మెల్యే రాజయ్య రాజకీయ భవిష్యత్తును పార్టీ అధినేతకు వదిలిపెట్టాలని తెలిపారు. ‘ఎమ్మెల్యే రాజయ్య భవిష్యత్తుకు పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది. రాజన్నకు సముచితమైన స్థానం కల్పిస్తుంది’ అని కేటీఆర్ భరోసా ఇచ్చారు. దీంతో అధినేత ఆదేశమే తనకు శిరోధార్యమని తెలిపి కడియం శ్రీహరికి రాజయ్య సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సమన్వయంతో అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని అభ్యర్థి కడియం శ్రీహరికి కేటీఆర్ సూచించారు. రాజయ్యకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
కడియం సంపూర్ణ మద్దతు: ఎమ్మెల్యే రాజయ్య
స్టేషన్ఘన్పూర్లో పార్టీ టికెట్ పొందిన కడియం శ్రీహరి అభ్యర్థిత్వానికి సంపూర్ణ మద్దతు అందించి, పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తెలిపారు. శుక్రవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్తో భేటీ అనంతరం నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం తాను సం పూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా కడియం శ్రీహరి గెలుపు కోసం తాను ముందుంటానని స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తెచ్చి అందరం కలిసికట్టుగా ప్రజల్లోకి వెళ్లి స్టేషన్ఘన్పూర్లో గులాబీజెండా ఎగురవేస్తామని కడియం శ్రీహరి, రాజయ్య పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్కు హామీ ఇచ్చారు.