హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ) : మునుగోడు ఉప ఎన్నికతో ప్రజలకు ఎలాంటి లాభం లేదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. కేవలం రాజగోపాల్రెడ్డి స్వార్థం వల్లే ఈ ఉప ఎన్నిక వచ్చిందని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్లో నిర్వహించిన మునుగోడు టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. రాజగోపాల్రెడ్డి ఎందుకు రాజీనామా చేశారో, మళ్లీ ఉప ఎన్నికలో ఎందుకు పోటీ చేస్తున్నారో ఆయనకు కూడా తెలియదని విమర్శించారు. ఎవరి ప్రయోజనాల కోసం ఈ రాజీనామా? అని ప్రశ్నించారు. రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్ కోసమే ఆయన బీజేపీలో చేరారని, ఆయన స్వార్థం కోసమే ఉప ఎన్నిక వచ్చిందని వివరించారు.
ఆయన అన్న వెంకట్ రెడ్డి కాంగ్రెస్ ఎంపీగా ఉండి.. బీజేపీలో ఉన్న తమ్ముడికి ఓటేయమని అడుగుతున్నారని, ఇంత దిగజారుడు, దివాలా రాజకీయానికి పాల్పడుతారా? అంటూ మండిపడ్డారు. 70 ఏండ్లు ఏలిన గత పాలకుల పుణ్యమే ఫ్లోరైడ్ సమస్య అని, మిషన్ భగీరథ ద్వారా దానిని తరిమికొట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ అని స్పష్టం చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు ప్రజలకు ఒక్క మంచి పని కూడా చేయలేదని విమర్శించారు. మునుగోడులో డబ్బులు పంచి గెలుద్దామని బీజేపీ నేతలు చూస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. టీఆర్ఎస్ పాలనలో కలిగిన ప్రయోజనాలను, కారు గుర్తుకు ఓటేస్తే కలిగే లబ్ధిని ప్రజలకు స్పష్టంగా వివరించాలని పార్టీ కార్యకర్తలకు మంత్రి హరీశ్రావు సూచించారు.
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎల్ఐసీ, రైల్వే, విమానాశ్రయాలు, ఎయిర్ ఇండియా వంటి సంస్థలను తెగనమ్ముతున్నదని మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. బీఎస్ఎన్ఎల్లో 75 వేల ఉద్యోగులను తొలగించిందని చెప్పారు. దేశంలో నిరుద్యోగం పెంచి, పేదల బతుకులను దుర్భరం చేసిందని విమర్శించారు. మరోవైపు రూ.400 ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను రూ.1,200కు పెంచిందని, డీజిల్, పెట్రోల్ ధరను రూ. 100 దాటించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కులం, మతం పేరుతో రెచ్చగొట్టి లబ్ధిపొందుతున్నది తప్ప ఏ మేలూ చేయలేదన్నారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.