హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): రేవంత్రెడ్డి ఏ పార్టీ నుంచి మరోసారి ముఖ్యమంత్రి అవుతారో చెప్పాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి డిమాండ్ చేశారు. పదేండ్లు ముఖ్యమంత్రిగా ఉంటానని పదే పదే చెప్తున్న రేవంత్రెడ్డి.. ఏ పార్టీతో టచ్లో ఉన్నారో? ఎవరెవరితో కనెక్షన్లు పెట్టుకొని ఇంకోసారి సీఎం అవుతానంటున్నారో తేల్చాలని వ్యాఖ్యానించారు. రెండోసారి కూడా తానే సీఎం అని రేవంత్రెడ్డి స్వయంగా ప్రకటించుకోవడమంటే కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానాన్ని, రాహుల్గాంధీని అవమానించడమేనని పేర్కొన్నారు. ఇటువంటి ప్రకటనలు పార్టీ అధిష్ఠానం దృష్టికి వస్తలేవా? తెలంగాణలో ఉన్నది రేవంత్ కాంగ్రెసా? రాహుల్ కాంగ్రె సా? అని నిలదీశారు. శనివారం ఆయన ఒక యూట్యూబ్ చానల్ ప్రతినిధితో మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ కార్యకర్తల రెక్కల కష్టం, నెత్తురు ధారపోస్తే రేవంత్రెడ్డి సీఎం అయ్యారని, కానీ కష్టపడ్డ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు న్యాయం జరగడంలేదని చెప్పారు.తెలంగాణలో ఇప్పటికీ ఆంధ్రా పెత్తందారులు, చంద్రబాబు మనుషుల పెత్తనమే నడుస్తున్నదని, వారికే పదవులు, కాంట్రాక్టులు దక్కుతున్నాయని రాజగోపాల్రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటే తానే పదేండ్లు ముఖ్యమంత్రినని చెప్పుకోవడం చాలా దారుణమని, దుర్మార్గమని మండిపడ్డారు.
ముఖ్యమంత్రిని ఎన్నుకోవడంలో కాంగ్రెస్ పార్టీకి ఒక సంప్రదాయం ఉన్నదని, నెహ్రూ కాలం నుంచి ఇప్పటివరకు ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ నెక్ట్స్ సీఎంను తానేనని ఎవరూ చెప్పుకోలేదని గుర్తుచేశారు. 140 ఏండ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో సీఎం రేవంత్రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. నేనే రాజు, నేనే మంత్రినని తనకు తాను ప్రకటించుకుంటుంటే మంత్రులు, పీసీసీ చీఫ్, సీనియర్ నాయకులు ఏం చేస్తున్నారని నిలదీశారు. తామందరం కలిసి కష్టపడితే రేవంత్రెడ్డికి అదృష్టం కలిసి వచ్చిందని, ఆయన మాటలు వింటుంటే ‘వినాశకాలే విపరీత బుద్ధి’ అనే సామెత గుర్తుకు వస్తున్నదని రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యానించారు.