హైదరాబాద్/యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): అసత్యాల ప్రచారంలో రాటుదాలేన బీజేపీ మునుగోడులో మెగా మాస్టర్ ప్లాన్ పేరుతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నది. 3ఏండ్లలో మునుగోడుకు ఏమీ చేయని రాజగోపాల్రెడ్డి.. 500 రోజుల్లో ఏదో చేస్తానని గప్పాలు కొడుతున్నా రు. మునుగోడు ఉప ఎన్నికకు సం బంధిం చి బీజేపీ ఇచ్చిన హామీలు.. వాస్తవికతపై కథనం.
బీజేపీ అబద్ధం: మండలానికొక పీఎంశ్రీ స్కూల్ తెస్తాం
వాస్తవం: మండలానికి రెండు చొప్పున పీఎం శ్రీ స్కూల్స్ మంజూరుచేస్తామని ఇప్పటికే కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. వీటిలో ఒక సెకండరీ స్కూల్, మరో ప్రాథమిక స్కూల్ చొప్పున అభివృద్ధి చేస్తారు. ఇందుకు కొన్ని షరతులకు అంగీకరిస్తూ రాష్ర్టాలు ఎంవోయూ కుదుర్చుకోవాల్సి ఉంటుంది. కానీ వీటిని తానే తెస్తానని గొప్పలు చెప్పుకోవడం రాజగోపాల్రెడ్డికే చెల్లింది.
బీజేపీ అబద్ధం: మర్రిగూడకు నవోదయ స్కూల్ కేటాయిస్తాం
వాస్తవం: కేంద్రం ఎప్పటి నుంచో అనుసరిస్తున్న విధానాల ప్రకారం జిల్లాకు ఒక నవోదయ స్కూల్ను ఏర్పాటు చేయాలి. తెలంగాణలో ఇప్పటివరకు 8 నవోదయ స్కూళ్లు మాత్రమే ఉన్నాయి. మరో 25 జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేయాల్సి ఉన్నది. దీనిపై సీఎం కేసీఆర్, ఎంపీలు లేఖలు రాసినా కేంద్రం ఒక్కటి కూడా మంజూరు చేయలేదు. కొత్తగా మర్రిగూడకు ఇస్తామంటూ బూటకపు హామీ ఇస్తున్నారు.
బీజేపీ అబద్ధం: మునుగోడులో ఫ్ల్లోరైడ్ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేస్తాం.
వాస్తవం: శాస్త్రవేత్తల ప్రతిపాదనలు, స్థానిక ప్రజల విజ్ఞప్తులతో చౌటుప్పల్లోని దండుమల్కాపురంలో ఫోైర్లెడ్ మిటిగేషన్ సెంటర్ ఏర్పాటుకు 2015లో కేంద్రం అనుమతి ఇచ్చింది. రూ.100 కోట్లతో పరిశోధనా కేంద్రం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా 10 ఎకరాల భూమిని కేటాయించింది. కానీ, పశ్చిమబెంగాల్ ఎన్నికల సమయంలో అక్కడి ఓట్ల కోసం ఈ సెంటర్ను తరలించింది. మళ్లీ మునుగోడుకు ఫ్లోరైడ్ సెంటర్ తెస్తామంటూ ఇజ్జత్ తీసుకొంటున్నది.
బీజేపీ అబద్ధం: నిరుద్యోగ యువతకు సొంత వ్యాపారాలు పెట్టుకోవడానికి లోన్లు ఇస్తాం
వాస్తవం: రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా లోన్లు ఎలా ఇస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. కేంద్రమే వివిధ కార్పొరేషన్ల నుంచి ఇచ్చే లోన్లకు మంగళం పాడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల ద్వారా దరఖాస్తులు స్వీకరించి లోన్లు ఇస్తున్నది. బీజేపీ ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తదో ఆ పార్టీకే తెలియాలి.
బీజేపీ అబద్ధం: జలశక్తి అభియాన్ పథకం ద్వారా తాగునీరు అందిస్తాం.
వాస్తవం: రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నది. మళ్లీ ఈ హామీ ఎందుకో అర్థం కాదు.
బీజేపీ అబద్ధం: గిరిజన ఉత్పత్తులను మార్కెట్లో అమ్మేలా ప్రోత్సహిస్తాం.
వాస్తవం: ఇప్పటికే తెలంగాణలో జీసీసీ ద్వారా గిరిజన ఉత్పత్తులను అమ్ముతున్నారు. వేల మంది గిరిజనులకు ఉపాధి కల్పిస్తున్నారు.
బీజేపీ అబద్ధం : 200కోట్లతో రోడ్లు అభివృద్ధి..
వాస్తవం: గతంలోనూ రోడ్లను వేయిస్తానని చెప్పి ఒక్కటీ వేయలేదు. అల్లందేవి చెరువు నుంచి నాగంవారిగూడెం, గొల్లగూడెం రోడ్లను బీటీగా మారుస్తానని చెప్పి గాలికొదిలేశారు. గుడిమల్కాపురం నుంచి సర్వేలు వరకు ఉన్న రోడ్డును డబుల్లైన్ చేస్తానని చెప్పి పట్టించుకోలేదు.
బీజేపీ అబద్ధం: సంస్థాన్ నారాయణపురానికి టెక్స్టైల్ పార్క్ తెస్తాం.
వాస్తవం: నేతన్నలకు ఉపాధి కల్పించే దిశగా సిరిసిల్లలో మెగా పవర్లూమ్ క్లస్టర్తోపాటు సిరిసిల్ల, దుబ్బాక, నారాయణపేట, పోచంపల్లిల్లో టెక్స్టైల్ పార్క్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నా ఇప్పటివరకూ కేంద్రం ఇవ్వలేదు. ఇప్పుడేమో సంస్థాన్ నారాయణపురానికి టెక్స్టైల్ పార్క్ పేరుతో కొత్త డ్రామాకు తెరతీశారు. దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో దుబ్బాకకు టెక్స్టైల్ పార్క్ ఇస్తామన్న హామీని బీజేపీ ఇప్పటికీ నెరవేర్చలేదు.
బీజేపీ అబద్ధం: ఉద్యోగమేళాలు నిర్వహించి ఏటా వెయ్యి మందికి ఉపాధి కల్పిస్తాం.
వాస్తవం: ఎమ్మెల్యే పదవీకాలం ఉండేది మరో ఏడాదే. నిజంగా ఈ హామీని అమలుచేసినా నియోజకవర్గం అంతటికీ ఇచ్చేది 1,000 ఉద్యోగాలే. అవీ ప్రైవేట్వే. అదీ కొన్ని మండలాలకే పరిమితం. ఈమేళాలు సంస్థాన్ నారాయణపురం, చౌటుప్పల్, చండూరు మండల కేంద్రాల్లో మాత్రమే నిర్వహిస్తారు. మర్రిగూడ, నాంపల్లి, మునుగోడు, గట్టుప్పల్ మండలాల నిరుద్యోగులకు ఇవ్వరు. దేశవ్యాప్తంగా ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటూ యువతను మోసం చేసిన బీజేపీ, ఇప్పుడు మునుగోడులోనూ అదే ప్రయత్నం చేస్తున్నది.
బీజేపీ అబద్ధం: నియోజకవర్గంలోని చెరువులను అభివృద్ధి చేస్తాం.
వాస్తవం: ఇప్పటికే తెలంగాణలో అమలవుతున్న పథకాలనే పేర్లు మ్యానిఫెస్టోలో పొందుపరిచారు. ఇప్పటికే మిషన్ కాకతీయ కింద చెరువుల అభివృద్ధిని చేపట్టింది. దీనికే బీజేపీ అమృత సరోవర్ అని పేరు పెట్టింది.