నల్లగొండ : మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి మునగడం ఖాయం. కుటుంబ పాలన గురించి రాజగోపాల్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండ లోని తన నివాసంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
కుటుంబ పాలన అంటున్న రాజగోపాల్ రెడ్డికి ఆయన సోదరులు, భార్య కనిపించలేదా? స్వార్ధ ప్రయోజనాల కోసం రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారన్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా వ్యక్తిగతంగా రాజగోపాల్కు.. రాజకీయంగా బీజేపీకి అవసరం. మునుగోడు అభివృద్ధి కోసం అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాజకీయంగా విస్తరణ కోసమే బీజేపీ రాజగోపాల్ రెడ్డితో రాజీనామా చేయించిందన్నారు.
రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడం కోసమే బీజేపీ ఉప ఎన్నికల వ్యూహం పన్నిందన్నారు. కాంగ్రెస్, బీజేపీలతో రాష్ట్రానికి తీరని నష్టం అన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నన్ని రోజులు రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఆయన తెలిపారు.
సెక్యులర్ రాష్ట్రంలో సెక్యులరిజం కేసీఅర్ తోనే సాధ్యం అని పేర్కొన్నారు. రేవంత్ పై దాసోజు శ్రావణ్ వ్యాఖ్యలు వాస్తవికంగా ఉన్నాయి. చాలా రాష్ట్రాలలో ప్రజలకు తినడానికి సరైన తిండి లేదు. అది వదిలి ఇతర అంశాల మీద పీఎం మోదీ దృష్టి పెడుతున్నారని విమర్శించారు.
నిత్యావసర ధరలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటి నుంచి దృష్టి మళ్లించేందుకే వివిధ రాష్ట్రాలలో ఉప ఎన్నికలు తెచ్చి రాజకీయ అనైతిక వాతావరణం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార పార్టీ ఘన విజయం సాధిస్తుందన్నారు.