హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి గురువారం లేఖ రాశారు. పార్టీ సభ్యత్వంతోపాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ లేఖలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిని ఉద్దేశించి పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రజాప్రతినిధి చేయకూడని పని చేసి జైలు పాలైన వ్యక్తితో తాను కలిసి పని చేయలేనని స్పష్టంచేశారు.
పార్టీ ద్రోహులకు, మిమ్మల్నే దూషించిన వ్యక్తులకు పార్టీ కీలక బాధ్యతలు అప్పగించడం బాధ కలిగించిందని పేర్కొన్నారు. కొంత కాలంగా అసలైన కాంగ్రెస్ నేతలకు, కార్యకర్తలకు పార్టీలో అవమానాలే ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. మీరు బాధ్యతలు అప్పగించిన వ్యక్తులు రాష్ట్రంలో పార్టీని పూర్తిగా నాశనం చేశారని పేర్కొన్నారు. కాగా, రాజగోపాల్రెడ్డి స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అపాయింట్మెంట్ కోరగా, ఈ నెల 8న సమయం ఇచ్చారు. దీంతో ఈ నెల 8న స్పీకర్ను కలిసి రాజగోపాల్రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖను అందజేయనున్నారు.
పార్టీ మార్పుపై ఆలోచిస్తా: కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
ఇప్పటికే తమ్ముడు రాజగోపాల్రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడటంతో ఇప్పుడు అన్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కూడా అదే బాటలో నడుస్తున్నట్టు తెలుస్తున్నది. ఇందుకు ఊతమిచ్చేలా గురువారం వెంకట్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మార్పుపై విలేకరులు అడిగిన ప్రశ్నను ఖండించకుండా.. తరువాత ఆలోచిస్తానంటూ సమాధానమివ్వడంతో.. ఆయన కూడా అదే బాటలో పయనించవచ్చనే ప్రచారం బలంగా వినిపిస్తున్నది.