చౌటుప్పల్, నవంబర్ 14 : కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి గొల్ల, కురుమల పేరు చెప్పి దొంగ దీక్షలు, ధర్నాలు చేస్తున్నారని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ విమర్శించారు. ఆయనకు తగిన బుద్ధి చెప్పేందుకు యాదవ సోదరులు సిద్ధంగా ఉన్నారన్నారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 75 వేల మంది గొల్ల, కురుమలకు రూ.12 వేల కోట్లతో గొర్రెలు కొనిచ్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని కొనియాడారు. గతంలో రూ.25 వేలున్న గొర్రెల సబ్సిడీని రూ.లక్షా 75 వేలకు పెంచి ఆదుకున్నారని తెలిపారు.
మునుగోడు నియోజకవర్గంలోని 7,600 మంది గొల్ల, కురుమల అకౌంట్లలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే డబ్బులు జమ చేసిందన్నారు. ఆ డబ్బులను తీసుకోనివ్వకుండా ఎన్నికల కమిషన్కు రాజగోపాల్రెడ్డి ఫిర్యాదు చేసి గొల్ల, కురుమల నోట్లో మట్టి కొట్టారని లింగయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు.