హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): ‘ఎన్నికల కమిషన్కు బీజేపీ ఫిర్యాదు చేయడంతోనే గొర్రెల యూనిట్లకు సంబంధించి గొల్లకురుమలకు నగదు పంపి ణీ ఆగిపోయింది. మునుగోడులో ఓడిపోయాక ఏమిచేయాలో తోచక రాజగోపాల్రెడ్డి గొల్ల కురుమలతో కలిసి ధర్నాలు చేస్తూ నాటకాలకు తెరతీశాడు. బీజేపీ ప్రభుత్వం గొల్లకురుమల అభివృద్ధి కోసం ఒక్క మంచి పని చేసిందని నిరూపించినా పదవికి రాజీనామా చేస్తా’ అని ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం అన్నారు. టీఆర్ఎస్ నేతలు, గొల్లకురుమల సంఘం నేతలు క్యామ మల్లేశం, అరుణ్కుమార్, కొలువుల నర్సిం, నారాయణ, ఎక్కాల కన్నా తో కలిసి ఆయన గురువారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు.
మునుగోడులో 7 వేల మందికి రూ. 93 కోట్లను సీఎం కేసీఆర్ విడుదల చేశారని, జాతీయ బ్యాంకు ల్లో ఖాతాలున్న గొల్లకురుమలు డబ్బులు డ్రా చేసుకొన్నారని.. గ్రామీణ బ్యాంకుల్లో ఖాతాలున్నవారే డ్రా చేసుకోలేదని చెప్పారు. ఒకసారి డబ్బులు ఇచ్చాక సీఎం కేసీఆర్ వాటిని వాపస్ తీసుకునే ముచ్చటే ఉండదన్నారు. దేశంలో ఎవరూ సీఎం కేసీఆర్లాగా తమ బాగోగులు పట్టించుకోలేదన్నారు. తాము కోరకుండానే సీఎం కేసీఆర్ యూనిట్కు రూ.1.58 లక్షల విలువచేసే గొర్రెల యూనిట్లో 75 శాతం సబ్సిడీ ఇచ్చారని గుర్తుచేశారు. గొల్లకురుమల ఆత్మగౌరవ భవనం కోసం వందల కోట్ల ఖరీదైన పదెకరాల భూమి, 10 కోట్లు నిధులిచ్చారన్నారు.
త్వరలో గొల్లకురుమల సదస్సు
మునుగోడులో ఓడిపోయి, మతిభ్రమించి రాజగోపాల్రెడ్డి పిచ్చిగా వాగుతున్నారని టీఆర్ఎస్ సీనియర్ నేత క్యామ మల్లేశం ధ్వజమెత్తారు. గొల్లకురుమల భుజాలపై తుపాకీ పెట్టి ప్రభుత్వాన్ని కాల్చాలని చూస్తే.. ఆ తూటాలు తిరగబడతాయనే విషయాన్ని గ్రహించాలని హితవు పలికారు. యాదవ సమాజానికి సీఎం కేసీఆర్ చేస్తున్న సహాయానికి కృతజ్ఞతగా తాము త్వరలో హైదరాబాద్లో షెపర్డ్ కమ్యూనిటీ వరల్డ్ కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నట్టు తెలిపారు. ఈ కాన్ఫరెన్స్లో సీఎం కేసీఆర్కు సన్మానం చేస్తామన్నారు.