Rajagopal Reddy : తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ఈ విషయంలో పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయమే అంతిమమని, దానికి అందరూ కట్టుబడి ఉండాలని స్పష్టంచేశారు. మునుగోడులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. “కొండా సురేఖకు సంబంధించిన పూర్తి నివేదిక హైకమాండ్ వద్ద ఉంది. పార్టీ తీసుకునే నిర్ణయానికి ఆమె కట్టుబడి ఉండాలి” అని ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ వంటి అంశాలను కాంగ్రెస్ అధిష్ఠానమే పర్యవేక్షిస్తుందని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. గత పదేళ్లుగా బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాడిన కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం చేయడమే తన ప్రధాన కర్తవ్యమని రాజగోపాల్ రెడ్డి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. తన పూర్తి దృష్టి కార్యకర్తల సంక్షేమంపైనే ఉందని పేర్కొన్నారు. మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తొలగించాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్కు లేఖ రాశారన్న వార్తల నేపథ్యంలో ఈ రాజకీయ పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.