హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): వివిధ కారణాలతో పంటసాయం అందని భూములకు ధరణి మోక్షం కలిగించింది. ధరణి పోర్టల్లో గ్రీవెన్స్ మాడ్యూల్ ప్రవేశపెట్టి పెండింగ్ సమస్యలను పరిష్కరించడంతో ఆయా భూములను సాగుచేసుకుంటున్న రైతులు కూడా పంటసాయం పొందనున్నారు. రాష్ట్రంలో ఈనెల 15 నుంచి వానకాలం రైతుబంధు పంపిణీ చేయనున్నట్టు సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్ 10వ తేదీ వరకు కటాఫ్గా నిర్ణయించి రైతుబంధుకు అర్హులైన రైతుల జాబితా తయారుచేయాలని ఆదేశించారు. ఈ మేరకు జాబితా తయారీ తుదిదశకు చేరుకున్నది. గత యాసంగి జాబితాతో పోల్చితే ఈసారి సుమారు రెండు లక్షల మంది కొత్తగా రైతుబంధు సాయం అందుకొనే అవకాశాలున్నాయి.