సెస్ సమస్యల పరిష్కారానికి కృషి
తెలంగాణ విద్యుత్తు రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ శ్రీరంగారావు
బోయినపల్లి, ఏప్రిల్ 16 : రాష్ట్రప్రభుత్వం నిర్మించిన రైతు వేదికలు దేశానికే ఆదర్శమని తెలంగాణ విద్యుత్ రెగ్యులేటర్ కమిషన్ చైర్మన్ శ్రీరంగారావు అన్నారు. సెస్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని.. సిబ్బంది, అధికారులు రైతులతో సయోధ్యగా ఉండి వారి కష్టాల్లో పాలుపంచుకోవాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో శుక్రవారం సెస్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికకు ఆయన హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ పాలనలో వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని చెప్పారు. రైతులు వ్యవసాయ భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. రైతు వ్యవసాయ భూమిలో 7.5 హెచ్పీల విద్యుత్తు మోటర్కు సోలార్ పవర్ను వినియోగించుకోవచ్చని సూచించారు. సెస్ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తునని హామీ ఇచ్చారు. ఈసందర్భంగా రామన్నపేటలో విద్యుదాఘాతంతో మృతిచెందిన నల్ల పద్మ, లక్ష్మి కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున రూ.10 లక్షల ఆర్థిక సాయం చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, సెస్ ఎండీ రామకృష్ణ , ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, కరీంనగర్ ఎస్ఈ మాధవరావు, కిసాన్ సంఘ్ ప్రతినిధి జోగినపల్లి సంపత్రావు తదితరులు పాల్గొన్నారు.