హైదరాబాద్ సిటీబ్యూరో, మే 6 (నమస్తే తెలంగాణ): పోగొట్టుకున్న పాస్పోర్టును తిరిగి పొందేందుకు అవస్థలు పడుతున్న వారికోసం హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ కార్యాలయం (ఆర్పీవో)లోని గ్రీవెన్స్ సెల్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఫిర్యాదుల దాఖలుపై అవగాహన కల్పించడం ద్వారా మళ్లీ సులభంగా పాస్పోర్టు పొందేందుకు వీలుకల్పిస్తున్నది. దీనిపై ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి జొన్నలగడ్డ స్నేహజ ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ.. పాస్పోర్ట్ పోగొట్టుకున్నవారు తొలుత ‘మీ-సేవ’ కేంద్రంలో దరఖాస్తు చేసుకుని వివరాలు అందజేయాలన్నారు. స్థానిక పోలీసులు ఆ వివరాలు పరిశీలించి అప్రూవల్ ఇస్తారని, తర్వాత ‘మీ-సేవ’ నుంచి ‘మిస్సింగ్/లాస్ట్ ఎక్నాలెడ్జ్మెంట్ సర్టిఫికెట్’ను పొందాక స్లాట్ బుక్ చేసుకుని రీఇష్యూ పాస్పోర్ట్కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంచుకున్న స్లాట్ రోజున పీఎస్కే కేంద్రానికి హాజరై సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు ‘మీ-సేవ’ నుంచి జారీ అయిన ‘మిస్సింగ్/లాస్ట్ ఎక్నాలెడ్జ్మెంట్ సర్టిఫికెట్ను చూపించాలని, ఆ ప్రక్రియ పూర్తయ్యాక 7-10 రోజుల్లోపు పాస్పోర్ట్ జారీ అవుతుందని వివరించారు. పోగొట్టుకున్న పాస్పోర్టు వివరాలు లేనివారు ఆర్పీవో కేంద్రానికి వచ్చి తమ గుర్తింపు కార్డు వివరాలు సమర్పించాలని తెలిపారు. డాటాబేస్లో పరిశీలించి సంబంధిత వ్యక్తి పాస్పోర్ట్ వివరాలు అందజేస్తారని, వాటి ఆధారంగా ‘మీ-సేవ’ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.