వరంగల్, మార్చి 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణకు, ప్రభుత్వానికి, ప్రజలకు అన్ని విషయాల్లో అండగా నిలవాల్సిన రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ యువకులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని, గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ ఆరోపించారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను తొక్కిపెడుతూ యువతకు ఉపాధి అవకాశాలు రాకుండా అడ్డుకుంటున్నది గవర్నరేనని విమర్శించారు. రాజ్భవన్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని యువతకు అండగా నిలుస్తానని చెప్పిన గవర్నర్ ఇప్పటివరకు ఆ దిశగా ఏం చేశారని ప్రశ్నించారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణితో కలిసి సత్యవతి రాథోడ్ హనుమకొండలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. రాజ్భవన్లో సోమవారం జరిగిన ఉగాది వేడుకల సందర్భంగా గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు.
తెలంగాణకు గవర్నర్గా ఉన్న తమిళసై బీజేపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న తెలంగాణ వ్యతిరేక విధానాలతోనే యువతకు అన్యాయం జరుగుతున్నదని చెప్పారు. తెలంగాణ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రతినిధిగా గవర్నర్ ఏనాడైనా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. విభజన చట్టంలోని బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ములుగు గిరిజన యూనివర్సిటీ విషయంలో గవర్నర్ ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎనిమిదేండ్లలో 16 ఉద్యోగాలైనా ఇచ్చిందా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఐటీఐఆర్ రద్దు చేసి యువతకు నష్టం చేసిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వుం తమకు నచ్చని పార్టీలపై ఈడీ, ఐటీ లాంటి రాజ్యంగ సంస్థలను ఉసిగొల్పుతున్నదని.. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాలలో గవర్నర్, రాజ్భవన్లను ఏజెన్సీలుగా నియమించుకున్నదని విమర్శించారు.
యువతపై ప్రేమే ఉంటే తొక్కిపెట్టిన బిల్లులను ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గవర్నర్కు లేఖ రాసినట్టు వెల్లడించారు. గవర్నర్ హోదాలో యువత ఉపాధి అవకాశాలను అడ్డుకొనేలా బిల్లులను తొక్కిపెట్టిన విషయాన్ని రాష్ట్ర యువత మరిచిపోదని తెలిపారు. కేంద్రం తెలంగాణ యువత పట్ల చూపుతున్న కక్షపూరిత వైఖరిపై గవర్నర్ ఏనాడూ ఒక మాట మాట్లాడలేదని… కనీసం కేంద్రానికి అధికారికంగా ఒక లేఖ రాయకపోవడం, విజ్ఞప్తి చేయకపోవడం విచారకరమని మంత్రి పేర్కొన్నారు. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు, ఉన్నత విద్యా సంస్థలను బలోపేతం చేసేందుకు తీసుకొచ్చిన యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ బిల్లును తొకిపెట్టిన విషయాన్ని గవర్నర్ సౌకర్యంగా మర్చిపోయినట్టు అనిపిస్తున్నదని వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. తెలంగాణ యువత ఎదురొంటున్న సవాళ్లకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా కారణమైతే, ఉద్యోగ అవకాశాలు కల్పించే బిల్లులను తొకిపెట్టి పరోక్షంగా గవర్నర్ కూడా కారణం అవుతున్నారని విమర్శించారు. యువతకు రాజ్ భవన్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన మాట వాస్తవమే అయితే .. కేంద్ర ప్రభుత్వ అన్యాయాలను అడ్డుకోవాలని.. తెలంగాణ యువత ఉద్యోగ, ఉపాధి, విద్య అవకాశాలపైన వివక్షపూరితంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిపై గళమెత్తాలని గవర్నర్కు సూచించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ సీతారాంనాయక్, టీఆర్ఎస్ నేతలు మర్రి యాదవరెడ్డి, పెద్ది స్వప్న పాల్గొన్నారు. మంత్రి సత్యవతిరాథోడ్ ఈ సందర్భంగా గవర్నర్ తమిళసైకి బహిరంగ లేఖ రాశారు.