Heavy Rains | హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్తుశాఖ అప్రమత్తంగా ఉన్నదని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి చెప్పారు. ప్రజలు కరెంట్తో జాగ్రత్తగా ఉండాలని, విద్యుత్తు స్తంభాలు, వైర్లను ఎట్టిపరిస్థితుల్లోనూ తాకొద్దని సూచించారు. గురువారం హైదరాబాద్లోని టీఎస్ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్తు సిబ్బంది, అధికారులు 24 గంటలు అందుబాటులో ఉంటారని తెలిపారు. 24 గంటలపాటు హెల్ప్లైన్ అందుబాటులో ఉంటుందని చెప్పారు.
ఎటువంటి ఇబ్బంది తలెత్తినా హెల్ప్లైన్ నంబర్లలో ప్రజలు సంప్రదించాలని సూచించారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి 345 కరెంట్ స్తంభాలు విరిగిపోయాయని, చాలా వరకు పునరుద్ధరించామని తెలిపారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ ఎకడా విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలగడం లేదని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు విద్యుత్తు ఉద్యోగులు, ఇంజినీర్లు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. చీఫ్ జనరల్ మేనేజర్, సూపరింటెండింగ్ ఇంజినీర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యుత్తు సరఫరా పరిస్థితిని సమీక్షించారు.