హైదరాబాద్ : కర్ణాటక నుంచి ఒడిశా వరకు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ద్రోణి శుక్రవారం స్థిరంగా కొనసాగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో శనివారం పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
కాగా ఆదివారం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడుతుందని తెలిపింది. కాగా గడిచిన 24 గంటల్లో 28 జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసినట్లు పేర్కొన్నది. ఇందులో మహబూబాబాద్, ములుగు, వరంగల్, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, యాదాద్రి భువనగిరి, నాగర్కర్నూల్, రాజన్న సిరిసిల్ల, జనగాం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినట్లు తెలిపింది. రాష్ట్రంలో అత్యధికంగా వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మంగళవారి పేట 8.80,. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం ఉప్పరిగూడెం 6.83, నల్లగొండ జిల్లా శాలిగౌరారం 6.85 సెంటీ మీటర్ల వర్షం కురిసినట్లు టీఎస్డీపీఎస్ వెల్లడించింది.
రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పడుతుండడంతో క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. రాష్ట్రంలో అత్యంత తక్కువగా సంగారెడ్డి జిల్లా కొహీర్లో 12.8 డిగ్రీల సెల్సీయస్ రాత్రి ఉష్ణోగ్రతలు నమోదైనట్లు టీఎస్డీపీఎస్ తెలిపింది. అలాగే పగటి ఉష్ణోగ్రతలు అత్యంత ఎక్కువగా వనపర్తి జిల్లా పుబ్బాయిర్లో 32.9 డిగ్రీల సెల్సీయస్ నమోదైనట్లు పేర్కొన్నది. రాగల 48గంటల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని తెలిపింది.