హైదారాబాద్ : నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ నెల 30 వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సోమవారం ఉదయం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది.
ప్రస్తుతం మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్, దక్షిణ ఒడిశా మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి, ఇంటీరియర్ ఒడిశా నుంచి దక్షిణ ఒడిశా వరకు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్టు తెలిపింది. వీటి ప్రభావం వల్ల రాష్ట్రంలో రాగల 48 గంటల వరకు ఆకాశం మేఘావృతమై ఉంటుందని పేర్కొన్నది.