TG Weather | తెలంగాణలో రాగల నాలుగు రోజులు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. బుధవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. గురు, శుక్రవారాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ వర్షాలు పడే అవకాశాలున్నాయని చెప్పింది.
శనివారం రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వానలు కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణశాఖ వివరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఇదిలా ఉండగా.. గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, సిద్దిపేట, జనగాం, సంగారెడ్డి, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మెదక్ జిల్లాలో రేగోడు గ్రామంలో 7.8, కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో 6.6, జగిత్యాల జిల్లా గోధురులో 6.8 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయ్యిందని టీజీడీపీఎస్ వివరించింది.