TS Weather | హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రాగల మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది ప్రస్తుతం వాయవ్య బంగాళాఖాతం సమీపంలోని పశ్చిమబంగ, ఒడిశా తీరాల్లో కొనసాగుతున్నది. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్రమట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది.
రెండు రోజుల్లో ఇది వాయవ్య దిశగా కదిలి జార్ఖండ్ మీదుగా వెళ్లే అవకాశం ఉన్నదని కేంద్రం పేర్కొన్నది. దీని ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్తోపాటు ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురువొచ్చని వెల్లడించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.