హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): బిపర్జాయ్ తుపాను కారణంగా నైరుతి ముందుకు కదలడం లేదు. ఈ నెల 11న ఏపీలోకి ప్రవేశించినా శ్రీహరికోటను దాటి రుతుపవనాలు ముందుకు సాగడం లేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏటా ఈ సమయానికి రుతుపవనాలు ఏపీ, తెలంగాణతో పాటు దేశంలోని సగానికిపైగా ప్రాంతాలకు విస్తరించేవని, కానీ, ఈ సారి అందుకు విరుద్ధమైన పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నది. ఈ నెల 19 నాటికి నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. 20 తర్వాత వర్షాలు కురిసే పరిస్థితులు ఉన్నాయని అంచనా వేసింది. రుతుపవనాల ఆలస్యంతో గరిష్ఠ ఉష్ణోగ్రత రోజురోజుకూ పెరుగుతున్నది.