హైదరాబాద్ : రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణలోకి బలంగా గాలులు వీస్తున్నాయని పేర్కొంది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి కారణంగా పలు జిల్లాల్లో మంగళవారం మోస్తరు వర్షాపాతం నమోదైంది. బుధ, గురువారాల్లోనూ వర్షాలు కురుస్తాయని, ఈ క్రమంలో వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. మంగళవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో వడగండ్ల భారీ వాన కురుస్తుందని హెచ్చరించింది.
కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురస్తాయని చెప్పింది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదవుతుందని పేర్కొంది. 13న ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని తెలిపింది.
ఇదిలా ఉండగా.. మంగళవారం ఉత్తర తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. నిర్మల్, కుమ్రంభీం, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, మంచిర్యాల తేలికపాటి భారీ వర్షం నమోదైంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో అత్యధికంగా 5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆ తర్వాత నిర్మల్ జిల్లా లక్ష్మణచాందలో 4.8, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 3, నిర్మల్ జిల్లా పెంబిలో 3, కుమ్రంభీం జిల్లా గిన్నెదరిలో 3, రాజన్న సిరిసిల్ల కందికట్కూరులో 3, మంచిర్యాల నస్పూర్లో 3, జగిత్యాల సిరికొండలో 2.8 సెంటీమీటర్ల వర్షం కురిసిందని టీఎస్ డీపీఎస్ తెలిపింది. పలుచోట్ల ఈదురుగాలుతో వర్షం కురవగా.. మరికొన్ని చోట్ల వడగళ్ల వాన కురిసింది.