హైదరాబాద్ : తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోని లింగంపల్లి, మియాపూర్, కుత్బుల్లాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గం, జూబ్లీహిల్స్, అమీర్పేట, నాంపల్లి, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, హయత్నగర్, మేడ్చల్, శామీర్పేట్ తదితర ప్రాంతాల్లో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. నల్గొండ, సూర్యాపేట, భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు, రాజపేట, మోటకొండూర్, తుర్కపల్లి, బొమ్మలరామారంలో వర్షం కురుస్తోంది. భువనగిరి మండలం నందనంలో భారీ వర్షం కురిసింది. సింగిరెడ్డిగూడెం రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి వద్ద భారీగా వర్షపు నీరు నిలిచింది.
వికారాబాద్ జిల్లాలోని కోట్పల్లి ప్రాజెక్టు అలుగు పారడంతో భారీగా వరద ప్రవహిస్తోంది. దాంతో చుట్టుపక్కల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లాలో పలుచోట్ల వర్షం కురుస్తోంది. దోమకొండ, బీబీపేట, మాచారెడ్డి, బిక్కనూర్, పాల్వంచ, పిట్లం, నిజాంసాగర్, భిక్కనూరు, లింగంపేటలో వర్షం పడుతోంది. ఎల్లారెడ్డి మండలం లక్ష్మాపూర్ వద్ద కల్వర్టు తెగింది. దాంతో రోడ్డు దెబ్బతిని ట్రాఫిక్ స్తంభించిపోయింది.
సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, మిరుదొడ్డి, తొగుట, దుబ్బాక, దౌల్తాబాద్లో వర్షం కురుస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. మంజీరా నదికి భారీగా వరద రాబోతుందని అంచనా వేసింది. మెదక్ జిల్లా టెక్మాల్లో అత్యధికంగా 19.1 సెం.మీ వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్లో 18 సెం.మీ, సంగారెడ్డి జిల్లా నిజాంపేట్లో 16.48 సెం.మీ, యాదాద్రి జిల్లా భువనగిరిలో 14.93 సెం.మీ, మహబూబ్నగర్లోని భూత్పూర్లో 9 సెం.మీ వర్షపాతం నమోదైంది.
అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో బుధ, గురువారాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.