హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను తీరం దాటినట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. తుఫాను ప్రభావంతో తెలంగాణ, ఏపీ, తమిళనాడులో భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. సోమవారం కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. ఏపీలోని తిరుమలలో గోగర్భం జలాశయం రెండు గేట్లు ఎత్తి నీరు విడుదల చేస్తున్నారు. కుమారధార, పసుపుధార, పాపవినాశనం, ఆకాశగంగా జలాశయాల్లో నీటి మట్టం పూర్తిస్థాయికి చేరింది. రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడినట్టు సమాచారం. ప్రకాశం జిల్లా కొత్తపట్నం సముద్రతీరం అల్లకల్లోలంగా మారింది. తుఫాను ప్రభావంతో దక్షిణ తెలంగాణలో చలి తీవ్రత తగ్గింది. హైదరాబాద్లో రెండ్రోజుల క్రితం 15 డిగ్రీల దిగువకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఉండగా, 21డిగ్రీలకు పెరిగింది. మరో రెండ్రోజులు ఇదే వాతావరణం ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.