Monsoon | తొలకరి పలకరించింది.. వానలు మొదలయ్యాయి.. వేయి కండ్లతో ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాల రాకతో రాష్ట్రమంతా చల్లబడింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో బుధవారం సాయంత్రం నుంచే వాన జోరుగా కురుస్తున్నది. గురువారం నాటికి తెలంగాణను నైరుతి తాకుతుందని వాతావరణ అధికారులు వెల్లడించినా.. బుధవారమే రాష్ట్రంలోకి రుతుపవనాలు వచ్చేశాయి.
హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకాయి. బుధవారం సాయంత్రం నుంచి హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురిసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. రాగల రెండు, మూడు రోజుల్లో దక్షిణ భారతదేశంలోని మరికొన్ని భాగాలకు నైరుతి విస్తరించే అవకాశాలున్నాయి. దిగువ స్థాయిలోని గాలులు ముఖ్యంగా వాయవ్య దిశ నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి వీస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.
బుధవారం రాత్రి 8 గంటల వరకు హైదరాబాద్లోని గచ్చిబౌలిలో అత్యధికంగా 2.2 సెం.మీ, మాదాపూర్, బీహెచ్ఈఎల్లో 1.8, ఖాజాగూడ, హఫీజ్పేట, చర్లపల్లిలో 1.7, ఏఎస్రావునగర్, జూబ్లీహిల్స్, హైదర్నగర్లో 1.5, మల్లాపూర్, తిరుమలగిరి, కాప్రాలో 1.2 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది.