హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. పశ్చిమ దిశగా కదులుతూ ఒడిశా, ఛత్తీస్గఢ్ దక్షిణ ప్రాంతాల మీదుగా విస్తరించింది. దీని ప్రభావంతో వచ్చే రెండు రోజుల్లో తెలుగు రాష్ర్టాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. మంగళ, బుధ వారాల్లో ఆసిఫాబాద్, పెద్దపల్లి, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, కరీంనగర్, సిద్దిపేటతోపాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ప్రారంభమైప నైరుతి రుతుపవనాల తిరోగమనం
నైరుతి రుతుపవనాల తిరోగమనం సోమవారం పశ్చిమ రాజస్థాన్ ప్రాంతం నుంచి మొదలైంది. అక్టోబర్ 15 నాటికి దేశం నుంచి రుతుపవనాల నిష్క్రమణ పూర్తవుతుంది. సాధారణంగా నైరుతి రుతుపవనాల నిష్క్రమణ రాజస్థాన్లో సెప్టెంబర్ 17 నుంచి ఆరంభమవుతుంది. కానీ, ఈ ఏడాది వారం ఆలస్యంగా మొదలవుతున్నది. ఈ ఏడాది నైరుతి ఆగమనం కూడా వారం రోజుల ఆలస్యంగానే మొదలైంది. సాధారణంగా నైరుతి రుతుపవనాల తిరోగమనంలోనూ వర్షాలు కురుస్తాయి. . వచ్చేనెల 15 వరకు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ సీజన్లో నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా ప్రభావం చూపకపోవడానికి పలు కారణాలున్నాయని వాతావరణ శాఖ చెప్తున్నది.