రాష్ట్రంలో వరుణుడి గర్జన ఆగడం లేదు. ఎడతెరిపిలేని వర్షాలు పల్లెలు, పట్టణాలను ముంచెత్తుతున్నాయి. జనజీవనం స్తంభించిపోయింది. తెలంగాణలో ఇంతటి భారీ వర్షాలు పడటం 34 ఏండ్ల తరువాత ఇదే మొదటిసారి. అత్యంత భారీ వర్షాలతో అనేక ప్రాంతాలలో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదవుతున్నది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో 39.10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంతోపాటు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో మరో రెండ్రోజులు ఇదే తీరున వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. 12 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపకశాఖ, మున్సిపల్ సిబ్బంది ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని చెరువులు మత్తళ్లు దుంకుతుండగా, పలుచోట్ల గండ్లు పడి నివాస ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. ఎంసెట్ పరీక్ష వాయిదా వేశారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూర పాత వంతెన పైభాగాన్ని తాకుతూ ప్రమాదకరంగా ప్రవహిస్తున్న మంజీరా నది
వరంగల్ జిల్లా గీసుగొండలో పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని వంతెన దాటిస్తున్న యువకులు
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గుంపెళ్లగూడెం గ్రామంలో వర్షానికి కూలిన ఇంటి వద్ద బాధితులు
హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: రాష్ట్రంలో వానలు దంచికొడుతున్నాయి. మొగులుకు చిల్లు పడిందా అన్న తీరులో పట్టణాలు, పల్లెలను ముంచెత్తుతున్నాయి. తెలంగాణలో 34 ఏండ్ల తర్వాత అంతటి భారీ వర్షాలు పడుతున్నాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు 30 ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. 91 ప్రాంతాల్లో 11 నుంచి 20 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదైంది. 71 ప్రాంతాల్లో 6 నుంచి 11 సెంటీమీటర్ల మధ్య వాన పడింది. 236 ప్రాంతాల్లో 6.50 సెంటీమీటర్ల లోపు వర్షం కురువగా, 166 ప్రాంతాల్లో 1.50 సెంటీమీటర్లలోపు వర్షం కురిసినట్టు తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సొసైటీ (టీఎస్డీపీఎస్) తెలిపింది. నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, పెద్దపల్లి, ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, మంచిర్యాల, ములుగు, నిజామాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిశాయని వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసినట్టు తెలిపింది.
పాలకీడులో మైనస్ 20 మి.మీ.
తెలంగాణలో ఓవైపు రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతుండగా, కొన్ని ప్రాంతాల్లో అతిస్వల్ప వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాష్ట్రంలోనే అత్యధికంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో 39.10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కాగా, అతితక్కువగా సూర్యాపేట జిల్లా పాలకీడు మండలంలో మైనస్ 20 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని టీఎస్డీపీఎస్ వెల్లడించింది.
34 ఏండ్ల తర్వాత..
34 ఏండ్ల తర్వాత రాష్ట్రంలో జూలైలో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణశాఖ రికార్డులు చెప్తున్నాయి. 1988 జూలై నెల మొత్తంలో 54.4 సెంటీమీటర్ల వర్షం కురువగా, ఈ ఏడాది జూలై 13 ఉదయం వరకే 34.4 సెంటీమీటర్ల వాన పడ్డది. మరో 17 రోజులు ఉన్న నేపథ్యంలో ఆ రికార్డులు కూడా మారే అవకాశం ఉన్నదని టీఎస్డీపీఎస్ అధికారులు తెలిపారు. వర్షాలు కురిసే రోజులు సాధారణంగా 61 రోజులుంటాయని, ఈ ఏడాది ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు వెల్లడించారు.
రెస్క్యూకు వెళ్లి ఇద్దరు గల్లంతు
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలంలోని బీబ్రా గ్రామానికి చెందిన వల్లకొండ సరస్వతి పురిటి నొప్పులతో బాధపడుతున్నది. ఆమెకు సాయం చేసేందుకు ఐదుగురు సభ్యుల సింగరేణి రెస్క్యూ టీం అక్కడికి బయల్దేరింది. ఈ క్రమంలో బృందంలోని ఇద్దరు గల్లంతయ్యారు. సాయంత్రం వరకు గాలించినా వారి అచూకీ లభించలేదు. కెరమెరి ఝరి గ్రామానికి చెందిన కోట్నాక కర్ణు (42) గుండెపోటుతో చనిపోయారు. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం వడ్యాల్లో పాత ఇల్లు కూలి నిద్రిస్తున్న వృద్ధుడు మృతిచెందాడు.
12 జిల్లాలకు రెడ్ అలర్ట్
రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం తెలిపారు. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని, బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడటంతోపాటు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నదని చెప్పారు. ఈ నేపథ్యంలో కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్.. ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్ జిల్లాలకు ప్రాథమిక హెచ్చరిక జారీ చేశారు. హైదరాబాద్లో ఓ మోస్తరు వర్షం పడే అవకాశం ఉన్నదని, రాత్రి సమయంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని చెప్పారు.