హైదరాబాద్, జూన్ 30(నమస్తే తెలంగాణ) : దేశంలో నైరుతి రుతుపవనాలు తీవ్రరూపం దాల్చాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రాబోయే 24నుంచి 72 గంటల్లో తెలంగాణ సహా దేశంలోని 23రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయ ని భారత వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాల పునరుద్ధరణ కేవలం రుతుపవన ద్రోణి వల్ల మాత్రమే జరుగలేదని, ఈ వారంలో బంగాళాఖాతంలో వరుసగా రెండు అల్పపీడన ప్రాంతాలు ఏర్పడి, మధ్య భారతదేశం గుండా భూభాగంలోకి కదలనున్నాయని వాతావ రణ నిపుణులు వెల్లడించారు. ఈ వ్యవస్థలు వాతావరణంలోకి భారీ మొత్తంలో తేమను పంపి, రుతుపవన ప్రసరణను మరింత బలపరుస్తాయని తెలిపారు. జూలై 1 నుంచి జూలై 4 మధ్య వర్షాలు మరింత విసృ్తతంగా కురిసే అవకాశం ఉన్నందున గరిష్ఠ ఉష్ణోగ్రతలు 5 నుంచి 6 డిగ్రీలు తగ్గినట్టు చెప్పారు. బుధవారం నాటికి ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దప ల్లి, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడుతుందని అంచనా వేశారు.
సగం జిల్లాల్లో లోటు వర్షపాతమే
జూన్లో 12శాతం లోటు వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. జూన్లో సాధారణ వర్షపాతం 13.03 సెం.మీ కురువాల్సి ఉండగా 11.53 సెం.మీ నమోదైంది. 16 జిల్లాల్లో -20నుంచి -59శాతం లోటు వర్షపాతం, హనుమకొండ జిల్లాలో అత్యధిక లోటు వర్షపాతం నమోదైనట్టు తెలిపింది. సాధారణ సగటు వర్షపాతం 142.1 మి.మి కురువాల్సి ఉండగా కేవలం 40.9 శాతం వర్షపాతం నమోదైంది. దాదాపు ఈ జిల్లాలో 71శాతం లోటు వర్షపాతం ఉన్నట్టు తెలిపారు. 12 జిల్లాల్లో సాధారణ వర్షపాతం 17శాతం నమోదైంది.