పలుజిల్లాల్లో ఈదురుగాలుతో వడగళ్ల వాన
25 వరకు వర్షాలు: వాతావరణ శాఖ హెచ్చరిక
పగలంతా నిప్పుల కుంపటి.. సూర్య భగవానుడి భగభగలు.. 40-45 డిగ్రీల ఉష్ణోగ్రతలు.. సాయంకాలం ఒక్కసారిగా అనూహ్య మార్పు. మబ్బులు కమ్ముకొచ్చాయి. గాలి దుమారం తోడైంది. ఉరుములు, మెరుపులు.. ఈదురుగాలులు..! నడి వేసవిలో రాష్ట్రమంతా వానజల్లు. ఉక్కపోతతో తల్లడిల్లుతున్న పట్టణజీవికి ఒక పులకరింత. మండే ఎండల నుంచి కాస్తంత ఉపశమనం. కానీ చెడగొట్టు వానతో పలుచోట్ల చేతికి వచ్చిన పంటలు దెబ్బతిన్నాయి. కల్లాల్లో ఆరబోసిన ధాన్యపు రాశులు తడిశాయి.
హైదరాబాద్, ఏప్రిల్21(నమస్తే తెలంగాణ): మండు వేసవిలో వరుణుడు దంచికొట్టాడు. గురువారం హైదరాబాద్తోపాటు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. పలుచోట్ల పిడుగులు పడ్డాయి. ఒక్కసారిగా కురిసిన వర్షంతో పలు ప్రాంతాల్లో పంటలకు నష్టం జరిగింది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో అకాల వర్షానికి రైతులు మార్కెట్కు తెచ్చిన వేరుశెనగ తడిసిసోయింది. అచ్చంపేటలో పిడుగుపడి ఎద్దు మృత్యువాత పడింది.
గురువారం సాయంత్రం వరకు ఎండలు దంచి కొట్టాయి. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశం మబ్బులు కమ్మింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. జీహెచ్ఎంసీతోపాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నాగర్కర్నూల్, సంగారెడ్డి, ములుగు, నిజామాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల, జయశంకర్ భూపాల్పల్లి జిల్లాల్లో వర్షం కురిసినట్టు టీఎస్డీపీఎస్ తెలిపింది. అత్యధికంగా సిద్దిపేట జిల్లా ములుగులో 4 సెంటీమీటర్లు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కేసవరంలో 3 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు వెల్లడించింది.
ఎల్లో హెచ్చరిక జారీ
ఈ నెల 25 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కర్ణాటక, కొమరన్, తెలంగాణల మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతుందని పేర్కొన్నది. దీని ప్రభావంతో ఈ నెల 25 వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉదని తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో హెచ్చరిక జారీ చేసింది.
విమానాల మళ్ళింపు…
భారీ వర్షం కారణంగా శంషాబాద్కు రావాల్సిన నాలుగు విమానాలను మళ్లించారు. గురువారం సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురవడంతో విమానాల ల్యాండింగ్కు వాతావరణం అనుకూలించలేదు. దీంతో సాయంత్రం సమయంలో రావాల్సిన వైజాగ్-హైదరాబాద్ విమానాన్ని విజయవాడకు, బెంగళూరు-హైదరాబాద్ విమానాన్ని నాగ్పూర్, ముంబాయి-హైదరాబాద్ విమానాన్ని విజయవాడకు, ఢిల్లీ-హైదరాబాద్ విమానాన్ని బెంగళూరుకు మళ్లించినట్టు శంషాబాద్ విమానాశ్రయ అధికారులు తెలిపారు.