జోగుళాంబ/వనపర్తి: ఉమ్మడి మహబూబ్నగర్లోని జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal), వనపర్తి జిల్లాల్లో (Wanaparthy) వాన దంచికొట్టింది. బుధవారం తెల్లవారుజామున ప్రారంభమైన ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం (Rain) ఉదయం 5 గంటలవరకు ఎడతెరపి లేకుండా కురిసింది. దీనికి ఈదురు గాలులు తోడవడంతో చేతికొచ్చిన పంట వర్షార్పణం అయింది. జోగుళాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా బుధవారం తెలవారుజామున కురిసిన అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. దీంతో రైతులు తీవ్ర నష్టాల పాలయ్యారు. చేతికొచ్చిన పంట వర్షంలో కొట్టుకుపోయింది. ఈదూరు గాలులకు వరి, మామిడి పంటలు (Mango crop) తీవ్రంగా దెబ్బతిన్నాయి. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో వాగులు పొంగిపొర్లాయి. పెద్దసంఖ్యలో చెట్లు నేలకొరిగాయి.
వనపర్తి జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం 3 గంటలకు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం ప్రారంభమై.. ఉదయం 5 గంటల వరకు ఎడతెరిపి లేకుండా కురిసింది. దీంతో వనపర్తి పట్టణంతోపాటు పలు మండలాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. వనపర్తిలోని కాలనీల్లో రహదారుల పైకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. వరి కోత దశలో భారీ వర్షం పడటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.