హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): జూన్ రెండో వారంలోనే తెలంగాణలో వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొనటం.. హరితహారం కార్యక్రమానికి కలిసిరానున్నది. సీఎం కేసీఆర్ దేశవ్యాప్త పర్యటన ముగించుకొని రాష్ర్టానికి రాగానే 8వ విడత ‘తెలంగాణకు హరితహారం’పై సమీక్షించి, తేదీని ప్రకటించే అవకాశం ఉన్నది. దీంతో అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కార్యక్రమానికి యాక్షన్ ప్లాన్ను జూన్ 3వ వారంలో ప్రారంభించాలని భావిస్తున్నారు. ఈ ఏడాది 19.54 కోట్ల మొక్కలను నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. అటవీ విస్తీర్ణం తక్కువగా ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, 8వ విడతలో ఆ ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఇప్పటికే సీఎం అధికారులకు సూచించారు. దీనితో.. అటవీ విస్తీర్ణం 10 శాతం కంటే తక్కువ ఉన్న జిల్లాల్లో పెద్ద ఎత్తున గ్రీనరీ పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో అధికారులు ముందుకు వెళ్లనున్నారు.
రాష్ట్రంలో 14,695 నర్సరీలు
అన్ని జిల్లాల్లో పచ్చదనాన్ని విస్తరించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వమే గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేసింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీ, పురపాలక శాఖలు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏల ఆధ్వర్యంలో 14,695 నర్సరీలను అభివృద్ధి చేసింది. హరితహారానికి కావాల్సిన మొక్కలను వీటి నుంచే అందిస్తున్నది. ఈ నర్సరీల్లో సుమారు 32.99 కోట్ల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 12,769 నర్సరీల్లో ఈ ఏడాది 20.16 కోట్ల మొక్కలను సిద్ధం చేశారు. అటవీశాఖ ఆధ్వర్యంలోని 550 నర్సరీల్లో 6.27 కోట్లు, పురపాలన, పట్టణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలోని 1002 నర్సరీల్లో 2.03 కోట్లు, హెచ్ఎండీఏ ఆధ్వర్యంలోని 44 నర్సరీల్లో 4.26 కోట్లు, జీహెచ్ఎంసీలోని 600 నర్సరీల్లో 1.25 కోట్ల మొక్కలను సిద్ధంగా ఉంచారు.