నిజామాబాద్: నిజామాబాద్ (Nizamabad) జిల్లాలోని పలు మండలాల్లో రాత్రి భారీ వర్షం (Rain) కురిసింది. డిచ్పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి, జక్రాన్పల్లి మండలాల్లో భారీ వాన కరిసింది. దీంతో అకాల వర్షానికి పలుగ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యపు (Paddy) రాశులు తడిసి ముద్దయ్యాయి. పలుచోట్ల వాననీటికి ధాన్యం కొట్టుకుపోయింది. జగిత్యాల (Jagitial) జిల్లాలో కూడా భారీ వర్షం కురిసింది. దీంతో కల్లాల్లో ఆరబోసిన ధాన్యం కొట్టుకుపోయింది. జిల్లాలోని కొడిమ్యాలలో వాన దంచికొట్టింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో వర్షం నీరు నిలిచిపోయింది.
కాగా, అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. పంట నష్టంపై నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షానికి దెబ్బతిన్న పంట నష్టం వివరాలను మే 1లోపు అందజేయాలని కలెక్టర్లను ఆదేశించారు. పంట నష్టంపై వెంటనే సర్వే చేపట్టాలని, ఇందుకోసం ప్రతి మండలానికి ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు. రాష్ట్రంలో మరికొన్ని రోజులపాటు ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడవకుండా తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
గత నెలలో జరిగిన పంట నష్టానికి సంబంధించిన పరిహారాన్ని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంగళవారం నుంచి పంపిణీ చేయనున్నారు. గత నెలలో పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలకు వరి, మక్కజొన్న, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. సీఎం కేసీఆర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులతో నేరుగా మాట్లాడి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని అప్పటికప్పుడే ప్రకటించి మానవీయతను చాటుకున్నారు.
క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించిన వ్యవసాయశాఖ 26 జిల్లాల్లో 1.51 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టు నిర్ధారించింది. ఆయా రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.151 కోట్లను ఇటీవలే విడుదల చేసింది. దీంతో ఆ నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో మంగళవారం నుంచి జమ చేయనున్నారు. దీంతో సీఎం కేసీఆర్ రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నట్టయ్యింది.