హైదరాబాద్ : నైరుతి రాజస్థాన్ పరిసర ప్రాంతాల నుంచి విదర్భ మీదుగా ఉత్తర తెలంగాణ వరకు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో బుధవారం అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే రాష్ట్రంలోకి ఆగ్నేయ దిశ నుంచి గంటకు 8 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని పేర్కొన్నది.
రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు 12 నుంచి 17.3 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు అవుతున్నాయని టీఎస్డీపీఎస్ తెలిపింది. రాష్ట్రంలో అత్యంత తక్కువగా రంగారెడ్డి జిల్లా చౌదరిగూడెం మండలం కాసులబాద్లో 12 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. పగటి ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో అత్యంత ఎక్కువగా కామారెడ్డి జిల్లా దోమకొండలో 33.6 డిగ్రీల సెల్సీయస్ నమోదైనట్లు టీఎస్డీపీఎస్ చెప్పింది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, పొగ మంచు ఏర్పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది.