53 అడుగులను దాటిన ప్రవాహం
24 గంటల్లోనే మూడో ప్రమాద హెచ్చరిక
వరద ప్రాంతాల్లో మంత్రుల పర్యటన
పంటనష్టం అంచనాలో వ్యవసాయశాఖ
నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 11: ఎగువన కురుస్తున్న వర్షాల ప్రభావంతో సోమవారం భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఆదివారం అర్ధరాత్రి 43 అడుగులకు చేరిన నీటిమట్టం.. సోమవారం సాయంత్రం 4 గంటలకు 53 అడుగులకు చేరింది. దీంతో జిల్లా జిల్లా కలెక్టర్ అనుదీప్ మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం వద్ద కేవలం 24 గంటల్లోపు మూడు ప్రమాద హెచ్చరికలను జారీ చేయడం గత పదేండ్లలో ఇదే మొదటిసారి. వరద ఉధృతి పెరుగుతుండటంతో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ హుటాహుటిన భద్రాచలం చేరుకొన్నారు. గోదావరి కరకట్ట, ముంపు ప్రాంతాలను పరిశీలించారు. గోదావరి వరద ఉధృతి కారణంగా భద్రాచలం నుంచి దాదాపు 50 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో కూడా గోదావరి ఉగ్రరూపం దాల్చగా, మానేరు ఉప్పొంగి ప్రవహిస్తున్నది. ఎల్ఎండీ రిజర్వాయర్లోకి ఇన్ఫ్లో పెరుగుతున్నది. జిల్లాలోని చెరువులు, కుంటలకు భారీగా వరద ప్రవాహం పెరిగింది. గోదావరిఖనిలో నాలుగు ఓపెన్ కాస్టుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో మహారాష్ట్ర సరిహద్దులోని పెన్గంగ నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం పెద్దంపేట వాగు వంతెన తెగిపోయింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో ప్రయణికులను, ఇద్దరు గర్భిణీలను వాగు దాటించారు. కాటారం మండలంలో శివశంకర్ ప్రాజెక్టు, విలాసాగర్ చెరువులకు గండ్లు పడ్డాయి. నిజామాబాద్ జిల్లాలో 68 గ్రామాల్లో 6,690 ఎకరాలు, కామారెడ్డి జిల్లాలోని 71 గ్రామాల్లో 3,715 ఎకరాల్లో వివిధ పంటలు నీట మునిగినట్టు వ్యవసాయాధికారులు అంచనా వేశారు.
పోచారం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల
వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలంలోని పోచారం ప్రాజెక్టు నీటి మట్టం పూర్తిస్థాయికి చేరుకొన్నది. దీంతో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్తో కలిసి ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు.
పంటలను పరిశీలించిన మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
నిర్మల్ జిల్లాలోని వరద బాధిత ప్రాంతాల్లో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పర్యటించారు. మామడ మండలం కిషన్రావుపేట, పరిమండల్ గ్రామంతో పాటు బాసర మండలం బిద్రెల్లి, టాక్లి, కిర్గుల్ గ్రామాల్లో నీట మునిగిన పంటలను పరిశీలించారు.
సత్వరమే పునరావాసం : మంత్రి శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్ జిల్లాలో ఇండ్లు కూలిపోయిన కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అధికారులను ఆదేశించారు. మహబూబ్నగర్ రూరల్ మండలం దివిటిపల్లి గ్రామంలో పలు ఇండ్లు కూలిపోవడంతో వెంటనే అక్కడకు వెళ్లారు. ఇండ్లు కూలిపోయిన సావిత్రి, లలిత, యాదయ్య, మణెమ్మ, అనంతరెడ్డి, శ్రీనివాసులు, రాజు కుటుంబాలను పరామర్శించి, వారికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
ప్రాణనష్ట నివారణ చర్యలు: మంత్రి సత్యవతి
వరదలతో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నదని, ఇందులో భాగంగానే గోదావరి తీరం వెంట కరకట్టను నిర్మించేందుకు రూ.137 కోట్లను మంజూరు చేసిందని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. సోమవారం ఆమె ములుగు జిల్లా రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి ప్రవాహాన్ని పరిశీలించారు. ఐటీడీఏ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వరదలు తగ్గే వరకు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, సెలవులు తీసుకోవద్దని ఆదేశించారు.
లోతట్టు ప్రాంతాల్లో జాగ్రత్త : ఎమ్మెల్సీ కవిత
నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. భారీ వర్షాలు, వరద పరిస్థితులపై నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సీ నారాయణరెడ్డి, స్పెషల్ ఆఫీసర్ క్రిస్టినా చొంగ్తూతో ఆమె ఫోన్లో హైదరాబాద్ నుంచి మాట్లాడారు. పంట నష్టాన్ని అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
మూగ జీవాల రక్షణకు చర్యలు
వరదల్లో చిక్కుకొన్న మూగజీవాలకు తక్షణ చికిత్స అందజేయడానికి, వ్యాక్సిన్లు ఇచ్చేందుకు పశుసంవర్థకశాఖ 1300 ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను రంగంలోకి దింపింది. అత్యవసర సేవలకు హెల్ప్లైన్ నంబర్ 040-23314876ను ఏర్పాటుచేసింది.
కాళేశ్వరం వద్ద తగ్గిన ప్రవాహం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి ప్రవాహం తగ్గింది. ఆదివారం ఉధృతంగా ప్రవహించిన గోదావరి సోమవారం సాయంత్రం వరకు కాస్త నెమ్మదించింది. సోమవారం సాయంత్రం 8.88 లక్షల క్యూసెక్కులు పారుతూ 11.41 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నది.