TSSPDCL | హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా గత పది రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు తదితర అన్నింటినీ యుద్ధప్రాతిపదికన పునరుద్ధరిస్తున్నామని టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు.
హైదరాబాద్లోని సంస్థ ప్రధాన కార్యాలయం నుంచి చీఫ్ జనరల్ మేనేజర్లు, జిల్లాల, సర్కిళ్ల సూపరింటెండింగ్ ఇంజినీర్లు, డివిజనల్ ఇంజినీర్లతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాలతో విద్యుత్ సరఫరా, మరమ్మతు పనులు తదితర అంశాలపై సమీక్షించారు. వర్షాలతో ఇప్పటివరకూ 2,770 స్తంభాలు, 34 ట్రాన్స్ ఫార్మర్లు దెబ్బతిన్నాయని అన్నింటినీ పునరుద్ధరించామని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 605 స్తంభాలు, 7 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినగా పునరుద్ధరించామని పేర్కొన్నారు. వర్షపు ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని, కావున అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, సెలవు రోజుల్లోనూ హెడ్క్వార్టర్స్లో అందుబాటులోనే ఉండాలని ఆదేశించారు. స్టోర్స్, ఆపరేషన్ సిబ్బంది సెలవు రోజుల్లోనూ విధులు నిర్వహించాలని ఆదేశించారు. సిబ్బంది, అధికారులు అందరూ తప్పనిసరిగా ముందస్తు భద్రతా చర్యలు పాటిస్తూ ఎలాంటి ప్రాణనష్టం కలగకుండా చూడాలని సూచించారు.
విద్యుత్ సంబంధిత ఫిర్యాదుల కోసం అన్ని జిల్లాల, సర్కిళ్ల హెడ్ క్వార్టర్లలో, హైదరాబాద్లోని సాడా కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. సాధారణ ప్రజలు, వినియోగదారులు విద్యుత్ పరికరాల పట్ల స్వీయ జాగ్రత్తలు పాటించాలని, ఏదైనా విద్యుత్ అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు సమీప విద్యుత్ కార్యాలయానికి, కంట్రోల్ రూమ్స్కు, సంస్థ మొబైల్ ఆప్, ట్విట్టర్, ఫేస్ బుక్, 1912/100కు కాల్ చేసి సమస్యను వివరించాలని సీఎండీ సూచించారు.