హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వర్షానికి దెబ్బతిన్న రోడ్లకు మహర్దశ వచ్చింది. ఆ రోడ్ల మరమ్మతు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు రూ.670 కోట్ల వ్యయంతో 1,757 కిలోమీటర్ల పొడవునా మరమ్మతులు పూర్తి కాగా, మరో 1,443 కిలోమీటర్ల పొడవున పనులు కొనసాగుతున్నాయి. ఈ నెలాఖరుకు పనులు పూర్తిచేయాలని రోడ్లు భవనాల శాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకొన్నారు. ఈ ఏడాది భారీవర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.2,861 కోట్లు మంజూరు చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా పాత ఆర్అండ్బీ సర్కిళ్ల పరిధిలో మొత్తం 6,641 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నట్టు అంచనాలు రూపొందించిన అధికారులు, గత ఫిబ్రవరిలో టెండర్ల ప్రక్రియ చేపట్టి పనులు ప్రారంభించారు. మొత్తం పనులను 1,173 ప్యాకేజీలుగా రూపొందించగా, ఇందులో అత్యధికంగా కరీంనగర్లో 175, వరంగల్లో 162, నల్లగొండలో 138 ఉన్నాయి. ఈ రోడ్ల మరమ్మతు పనులు నాణ్యంగా, శరవేగంగా పూర్తిచేయాలని అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ క్రమంలోనే ఎక్కడా జాప్యంలేకుండా పనులు చేపట్టి కొనసాగిస్తున్నారు. మొదట్లో కార్మికుల కొరత, అనంతరం అకాల వర్షాల వల్ల పనుల్లో కొంత జాప్యం చోటుచేసుకొన్నప్పటికీ ప్రస్తుతం పనులు ఊపందుకొన్నాయి.
ప్రాధాన్యతా రోడ్ల పనులు పూర్తి
జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర రాజధానికి వెళ్లే ప్రధాన రోడ్లను ప్రాధాన్యతాక్రమంలో ముందుంచి పనులు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. ఈ పనులన్నీ దాదాపు పూర్తయ్యాయని, మరో 1,443 కిలోమీటర్ల పొడవునగల 261 ప్యాకేజీ పనులు ఈ నెలాఖరుకు పూర్తవుతాయని వెల్లడించారు. 2,389 కిలోమీటర్ల పొడవునా చేపట్టనున్న 370 ప్యాకేజీల పనులు వచ్చే ఒకటి-రెండు రోజుల్లో ప్రారంభించనున్నట్టు చెప్పారు. వర్షాలు ప్రారంభమయ్యే సూచనలు ఉన్నందున పనుల్లో కొంత జాప్యం చోటుచేసుకొనే అవకాశం ఉండటంతో ప్రధాన రోడ్ల పనులు ముందుగా పూర్తిచేసినట్టు వారు వివరించారు.