Rain Alert | హైదరాబాద్ : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరో 3 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. రంగారెడ్డి, యాదాద్రి, సూర్యాపేట, నల్లగొండ, వరంగల్, ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
ఈ నెల 22న నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతారవణ శాఖ తెలిపింది. ఈ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. ఈ నెల 25వ తేదీ నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతం దాని సమీపంలోని ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
తదుపరి ఆ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి వాయువ్య దాని సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర కోస్తా తీరం సమీపంలో ఈ నెల 26 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు. ఈ వాయుగుండం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర కోస్తా తీర ప్రాంతంలో ఈ నెల 27 నాటికి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు.