మారేడ్పల్లి, జనవరి 19: జర్నలిస్టుల రైల్వే పాస్లను వెంటనే పునరుద్ధరించాలని జర్నలిస్టు సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సికింద్రాబాద్ రైల్నిలయం ఎదుట హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్యుజే), తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ పెడరేషన్ ( టీడబ్ల్యూజేఎఫ్), తెలంగాణ బ్రాడ్ కాస్టింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ల నాయకులు, జర్నలిస్టులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అనంతరం జర్నలిస్టుల రైల్వేపాస్లను కొనసాగించాలని కోరుతూ సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్కు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా 50 శాతం రాయితీ కొనసాగించాలని జీఎంను కోరారు.
అనంతరం హెచ్యూజే అధ్యక్షుడు అరుణ్కుమార్ మాట్లాడుతూ… జర్నలిస్టుల రైల్వే పాస్లను కేంద్రం పునరుద్ధరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు. కార్యదర్శి జగదీష్ మాట్లాడుతూ జర్నలిస్టుల రైల్వే పాస్ రాయితీల విషయంలో కేంద్రం తీరు సరైనది కాదన్నారు. కేంద్రం ఇప్పుడు కొత్తగా ఇచ్చేది కాదని ఏండ్ల తరబడి కొనసాగుతూ వచ్చిన రైల్వే పాస్లను ఇప్పుడు తొలగించడం పై టీడబ్ల్యూజేఎఫ్ ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్య మండిపడ్డారు. చిన్న,మధ్య తరగతి జర్నలిస్టుల విషయంలో కేంద్ర వైఖరి మార్చుకోవాలని రాష్ట్ర కార్యదర్శి ఈ.చంద్రశేఖర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు నాయకులు రఘు, గండ్ర నవీన్, రాజశేఖర్, సలీమా, నాగవాణి, చంద్రమోహన్, సుభాష్, వీరేశ్, బ్రహ్మానందం, శివశంకర్, ప్రతాప్, నానీ, నర్సింగ్రావు, శ్రీనివాస్, జనార్దన్, యాదగిరి, సత్యం, మల్లికార్జున్, శ్రీనివాస్గౌడ్, రాములు, రాజయ్యలతో పాటు సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన జర్నలిస్టులు పాల్గొన్నారు.